సైనికుల వల్లే ప్రశాంతంగా నిద్రిస్తున్నాం: రావత్‌ 

సరిహద్దుల్లో పరిస్థితులు క్షేమంగా ఉన్నప్పుడే దేశం ప్రశాంతంగా నిద్రపోగలదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ అన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని ఆర్మీ, ఐటీబీపీ జవాన్లతో కలిసి శనివారం ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

Published : 15 Nov 2020 03:13 IST

డెహ్రాడూన్‌: సరిహద్దుల్లో పరిస్థితులు క్షేమంగా ఉన్నప్పుడే దేశం ప్రశాంతంగా నిద్రపోగలదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ అన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని ఆర్మీ, ఐటీబీపీ జవాన్లతో కలిసి శనివారం ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కోపాంగ్‌లోని ఐటీబీపీ శిబిరం, హార్షిల్‌లోని బిహార్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ సైనికులను కలిసి వారితో సమయం గడిపారు. అక్కడి జవాన్లకు మిఠాయిలు పంచి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ.. ‘మన సైనిక బలగాలు దేశ సరిహద్దుల్లో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం శ్రమిస్తున్నారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉండి విధులను నిర్వర్తిస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు విధుల్లో అప్రమత్తంగా ఉన్నందువల్లే దేశం ప్రశాంతంగా నిద్రపోతోంది. మహిళా సైనికాధికారులు సైతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ రక్షణకు వారి సేవలను అందించడం ఎంతో అభినందనీయం. వారు ఎందరికో ఆదర్శం కూడా. నా తండ్రి సైతం దేశ సైన్యంలో పనిచేశారు. ఈ రోజు నేను మీతో పండగను జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సీఎం రావత్‌ వెల్లడించారు. 

కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం శనివారం దీపావళి వేడుకలను దేశ సైనికులతో కలిసి జరుపుకొన్న విషయం తెలిసిందే. జైసల్మేర్‌లోని లొంగేవాలా పోస్ట్‌లో జవాన్లను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు అందజేసి ప్రసంగిస్తూ.. సరిహద్దుల్లో ఘర్షణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలు పాక్‌, చైనాలకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు. 

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఇవీ చదవండి..

సరిహద్దుల్లో పరీక్షిస్తే.. దీటైన జవాబు తప్పదు: మోదీ

యుద్ధ ట్యాంకర్‌పై మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని