కరోనా సంక్షోభం వేళ.. ప్రేక్షకపాత్ర పోషించలేం!

కొవిడ్‌ మహమ్మారితో యావత్‌ దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేక్షకుడిగా ఉండలేమని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Updated : 27 Apr 2021 15:04 IST

పలు చర్యలు చేపట్టాలన్న భారత అత్యున్నత న్యాయస్థానం

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారితో యావత్‌ దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేక్షకుడిగా ఉండలేమని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కరోనా విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన స్థితిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని తెలిపింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, నేడు మరోసారి విచారణ చేపట్టింది.

‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావత్‌ దేశం పోరాటం చేస్తున్న సమయంలో సుప్రీం కోర్టు జోక్యం ఎంతో అవసరం. జాతీయ సంక్షోభం వేళ భారత అత్యున్నత న్యాయస్థానం స్పందించకుండా ఉండలేదు’ అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఇప్పటికే హైకోర్టుల్లో కరోనా అంశాలపై జరుగుతున్న విచారణను ఆపే ఉద్దేశం తమకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి అంశాలపై హైకోర్టులే సరైన నిర్ణయం తీసుకోగలవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో హైకోర్టులు మెరుగుగానే పనిచేస్తున్నాయని.. ఆర్టికల్‌ 226 ప్రకారం, హైకోర్టులు తమ అధికారాలను వినియోగించకుండా తాము నిరోధించడం లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భాట్‌ త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వారు పరిశీలించలేని సమస్యలపై మాత్రమే సహాయం చేసే పాత్రను తాము పోషిస్తామని అభిప్రాయపడింది.

దేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గతవారమే విచారణ చేపట్టింది. తొలుత అప్పటి చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ప్రణాళికను కోర్టు ముందుంచాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ప్రణాళికను తాజాగా సుప్రీం కోర్టుకు నివేదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆక్సిజన్‌ లభ్యత, రాష్ట్రాల ఆక్సిజన్‌ అవసరాలు, కరోనా తీవ్రత ప్రాంతాల్లో చర్యలు, టీకా లభ్యత వంటి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా టీకా ధర నిర్ణయంపై వివరణ ఇవ్వాలని కోరింది. వీటితో పాటు ధరల నియంత్రణకు పేటెంట్‌ చట్టం అమలు అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. వీటిపై గురువారం సాయంత్రం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్త, మీనాక్షి అరోరాలను సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని