‘శృంగార తార’ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్‌

‘ఊర్మిళ శృంగార తార’ అంటూ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. కొత్త వివాదానికి తెర లేపిన సంగతి తెలిసిందే. ఆమెకు నటన రాదని, కేవలం శృంగార తారగా మాత్రమే గుర్తింపు పొందారని విమర్శించారు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు నెటిజన్లు కంగనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా

Updated : 21 Sep 2020 08:43 IST

ముంబయి: ‘ఊర్మిళ శృంగార తార’ అంటూ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. కొత్త వివాదానికి తెర లేపిన సంగతి తెలిసిందే. ఆమెకు నటన రాదని, కేవలం శృంగార తారగా మాత్రమే గుర్తింపు పొందారని విమర్శించారు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు నెటిజన్లు కంగనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా తనవైపు నిలిచిన వారికి ఊర్మిళ ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు మద్దతు తెలిపిన ‘రియల్ పీపుల్ ఆఫ్ ఇండియా’కు.. పక్షపాతంలేని, గౌరవ ప్రదమైన మీడియాకు ధన్యవాదాలు. తప్పుడు విమర్శలు, ప్రచారానికి వ్యతిరేకంగా ఇది మీరు సాధించిన విజయం. మీ అభిమానం, ప్రేమ నా మనసును తాకాయి. జై హింద్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మొదటి నుంచి బాలీవుడ్‌ ప్రముఖులపై కంగన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత మరోసారి బీటౌన్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ కోణం బయటపడంతో ఆమె వ్యాఖ్యలు తీవ్రరూపం దాల్చాయి. మరోపక్క ముంబయి ప్రభుత్వం, శివసేన పార్టీ నాయకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశిస్తూ ఊర్మిళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భాజపా టికెట్‌ పొందేందుకే కంగన ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి నగరం గురించి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు’ అని చెప్పారు.

దీనిపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఊర్మిళ కామెంట్లు నా పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. భాజపా టికెట్‌ పొందడం కోసమే నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నానని ఆమె నాపై ఆరోపణలు చేశారు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే టికెట్‌ పొందడం నాకు అంతపెద్ద కష్టమేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా ఓ శృంగార తారగా మాత్రమే ఆమె ప్రజలకు సుపరిచితురాలైంది. అలాంటిది ఆమే టికెట్‌ పొందగలిగితే.. నేను ఎందుకు పొందలేను’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని