Divi: చిరంజీవి చిత్రంలో అవకాశం వచ్చింది 

‘‘నటిగా నాకంటూ ఎలాంటి పరిమితులు లేవు. మనసుకు నచ్చిన పాత్ర  దొరికితే చాలు. చేసేది పెద్ద చిత్రమా.. చిన్న సినిమానా? అని అసలు పట్టించుకోను’’ అంటోంది నటి దివి

Updated : 25 May 2021 10:34 IST

‘‘నటిగా నాకంటూ ఎలాంటి పరిమితులు లేవు. మనసుకు నచ్చిన పాత్ర  దొరికితే చాలు. చేసేది పెద్ద చిత్రమా.. చిన్న సినిమానా? అని అసలు పట్టించుకోను’’ అంటోంది నటి దివి. ‘మహర్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసిన తెలుగు భామ ఆమె. ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ‘క్యాబ్‌ స్టోరీస్‌’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించబోతుంది. శ్రీహాన్, ధన్‌రాజ్, గిరిధర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ఇది. కె.వి.ఎన్‌.రాజేశ్‌ దర్శకుడు. ఎస్‌.కృష్ణ నిర్మించారు. ఈనెల 28న ‘స్పార్క్‌’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా దివి మీడియాతో ముచ్చటించింది. 

* ‘మహర్షి’ చేస్తున్న సమయంలో రాకేష్‌ అనే తోటి నటుడి సహాయం వల్ల.. ‘క్యాబ్‌స్టోరీస్‌’లో అవకాశమొచ్చింది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. ఆ మూడు రోజుల్లో ఓ క్యాబ్‌లో ప్రయాణించిన నలుగురి జీవితాలు ఎలాంటి  మలుపులు తీసుకున్నాయన్నది ఈ సిరీస్‌ కథ.

* నేనిందులో ఓ  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా కనిపిస్తా. నాకొక చిన్న ప్రేమకథ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో నేను ఆ క్యాబ్‌ ఎక్కాక.. మా జీవితాల్లోనూ కొన్ని సమస్యలెదురవుతాయి. మరి ఆ క్యాబ్‌లో మూడు రోజులు ఏం జరిగింది? దాని వల్ల మా అందరి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి? అన్నది సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ వెబ్‌సిరీస్‌కి కొనసాగింపుగా మరో పార్ట్‌ను తీసుకొచ్చేందుకు మా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

*  ‘‘స్పార్క్‌’ ఓటీటీ కొత్తదైనా.. దాని వెనక రామ్‌గోపాల్‌ వర్మ లాంటి దర్శకులు ఉండటం వల్ల మా సిరీస్‌కి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకంగా ఉన్నాం. ప్రస్తుతం నేను కథానాయికగా ‘లంబసింగి’ అనే చిత్రం చేస్తున్నా. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తయింది. 

* చిరంజీవి సర్‌తో మెహర్‌ రమేష్‌ చేయనున్న ‘వేదాళం’ రీమేక్‌లో నాకొక పాత్ర ఉంది. ఇటీవలే రమేష్‌  సర్‌ కథ వినిపించారు. చాలా బాగుంది. వీటితో పాటు  పేరు ఖరారవ్వని కొన్ని చిత్రాలు చేస్తున్నా. అలాగే ఆర్కా మీడియాలో హాట్‌స్టార్‌ కోసం ‘ఘర్షణ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని