‘సుప్రీంకోర్టు తీర్పుతో నా 20 ఏళ్ల కల సాకారం’ 

 సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సినీ నటి విజయశాంతి స్వాగతించారు.  సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’లను ఇచ్చేందుకు...

Published : 19 Feb 2020 00:49 IST

హైదరాబాద్‌: సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సినీ నటి విజయశాంతి స్వాగతించారు. సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’లను ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై విజయశాంతి ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘ఐపీఎస్ అధికారి, లెక్చరర్, ప్రొఫెసర్, లాయర్, సీబీఐ అధికారి, మహిళా మంత్రి, ఆటోడ్రైవర్, ముఖ్యమంత్రి, జర్నలిస్టు, పారిశ్రామికవేత్త, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమకారిణిగా ఇలా ఎన్నో అసంఖ్యాక పాత్రలతో మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం నాకు లభించింది. 1979లో ప్రారంభమైన నా సినీ ప్రయాణం.. నాటి నుంచి నేటి వరకూ ప్రేక్షకుల ఆశీస్సులు నాకు లభించాయి.  నేను నటించిన చిత్రాల్లో బహుభాషా చిత్రం ‘భారతరత్న’లో పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర నాతో పాటు తెలుగు ప్రేక్షకులకూ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను ఆర్మీ ఆఫీసర్గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని