Vikram: విక్రమ్‌.. ‘తంగలాన్‌’

విక్రమ్‌ కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘తంగలాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Updated : 24 Oct 2022 11:23 IST

విక్రమ్‌ కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘తంగలాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో గ్లింప్స్‌ను పంచుకున్నారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కుతునట్లు అర్థమవుతోంది. ఇందులో విక్రమ్‌ ఓ గిరిజన తెగకి చెందిన నాయకుడి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.


‘మరో భారతం’కు శ్రీకారం

శియా గౌతమ్‌ ప్రధాన పాత్రలో జగదీష్‌ దూగాన తెరకెక్కిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘మరో మహాభారతం’. ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్‌ పూరి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌ చాలా బాగుంది. మంచి కథతో రానున్న ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కథకు తగ్గట్లుగా ఉంటుందని శియాను తీసుకున్నాం. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు చిత్ర దర్శకుడు.


కాశీలో మొదలైన ప్రేమకథ..

జైద్‌ ఖాన్‌ కథానాయకుడిగా జయతీర్థ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బనారస్‌’. తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మాత. సోనాల్‌ మాంటెరో కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో నిర్మాత సతీష్‌ వర్మ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘తొలి తొలి వలపే’’ గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌, భాస్కరభట్ల సాహిత్యమందించారు. కార్తీక్‌, కె.ఎస్‌.చిత్ర ఆలపించారు. ‘‘బనారస్‌ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో మిళితమై ఉంటుంది. జైద్‌, సోనాల్‌ జోడీ చూడముచ్చటగా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: కె.ఎం.ప్రకాష్‌, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి.


‘ఇఫీ’లో మహాశ్వేతాదేవి జీవిత కథ

ప్రఖ్యాత రచయిత్రి, హక్కుల కార్యకర్త, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత మహాశ్వేతా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన బెంగాలీ చిత్రం ‘మహానంద’. వచ్చే నెలలో గోవాలో జరగనున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో పనోరమా ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో ప్రదర్శనకు ఎంపిక చేసినట్టు ఆదివారం నిర్వాహకులు ప్రకటించారు. దీనికి అరిందమ్‌ సీల్‌ దర్శకుడు. గార్గి రాయ్‌చౌధురి, దేబ్‌శంకర్‌ హైదర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఎంపికపై దర్శకుడు సంతోషం వ్యక్తం చేస్తూ ‘న్యాయనిర్ణేతల బృందానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఇది జాతీయస్థాయిలో ప్రదర్శితం కావడం చాలా సంతోషం. ఈ ఎంపికను ఒక గౌరవంగా భావిస్తున్నా’ అన్నారు. మరో బెంగాలీ చిత్రం ‘టోనిక్‌’ మెయిన్‌స్ట్రీమ్‌ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. యువ స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరాం బోస్‌ జీవిత కథతో తెలుగు దర్శకులు విజయ్‌ జాగర్లమూడి, డీవీఎస్‌ రాజులు తెరకెక్కించిన ‘ఖుదీరాం బోస్‌’ సైతం ‘ఇఫీ’కి ప్రదర్శితం అవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని