Naga Vamsi: మీ మాటలకు మేము ఎంత ఫీలవుతామో అర్థం చేసుకోండి: నాగవంశీ

ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్స్‌ చేశారు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) నిర్మాత నాగవంశీ (Naga Vamsi). వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా  అభిప్రాయాలను తెలియజేస్తే.. వాటిని స్వాగతిస్తామని అన్నారు.

Published : 15 Dec 2023 17:42 IST

హైదరాబాద్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సెకండ్‌ సింగిల్‌ విడుదలయ్యాక పలువురు నెటిజన్ల నుంచి వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. ‘మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. జనవరి 12న కలుద్దాం’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా సమాధానం చెప్పారు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారిన కొంతసమయానికి ఆయన మరో ట్వీట్‌ చేశారు. సరైన పద్ధతిలో అభిప్రాయాన్ని తెలియజేయాలని.. అలాంటి వాటిని తాము ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.

‘‘(మొదట పెట్టిన ట్వీట్‌ను ఉద్దేశిస్తూ).. ఒక నిర్మాతగా నేను పెట్టిన పోస్ట్‌ మిమ్మల్ని బాధించింది కదా. తమ వృత్తిని నిర్వర్తిస్తున్న మా టీమ్‌ సభ్యులపై రోజు విడిచి రోజు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మేము ఎంతలా ఫీలవుతామో అర్థం చేసుకోండి. అసభ్యకరమైన పదజాలం, వ్యక్తిగత దూషణలు లేని అభిప్రాయాలను మేము స్వాగతిస్తున్నాం. మర్యాదకరమైన మాటలతోనూ మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. మునుపెన్నడూ చూడని మాస్‌ అవతార్‌లో మహేశ్‌బాబు ఈ సినిమాలో కనిపిస్తారని ఆయన తెలిపారు.

రవితేజ చిత్రాన్ని రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌ అంటూ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

అసలేం జరిగిందంటే:  మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ప్రచార చిత్రాలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఓ మై బేబీ’ పాట విడుదలైంది. 2.59 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించారు. అయితే, ఈ పాట తమకు నచ్చలేదంటూ పలువురు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెట్టారు. సంగీత దర్శకుడు తమన్‌, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి వర్క్‌పై విమర్శలు చేశారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశంతో టెక్నీషియన్స్‌ను టార్గెట్‌ చేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్స్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని