అలా ‘కొదమ సింహం’లో మోహన్‌బాబును క్లైమాక్స్‌ వరకూ పొడిగించాం!

ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి తీసిన సత్యానంద్‌, మురళీ మోహన్‌ గారి అబ్బాయి సత్యానంద్‌ని థియేటర్‌లో చూశాను. అలాంటి సత్యానంద్‌తో అలాంటి క్షణక్షణం.. థియేటర్లుల్లో ఆడకపోయినా.

Published : 04 Aug 2021 01:41 IST

చెప్పింది వింటారే తప్ప ఎక్కువ మాట్లాడరు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్‌ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల రచయిత సత్యానంద్‌తో ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సౌమ్యుడు, మితభాషి.. సత్యానంద్‌

‘‘సత్యానంద్‌, జంధ్యాల ఇద్దరూ కలిసి పనిచేశారని గతంలో మీకు చెప్పాను. ఇండస్ట్రీకి రాకముందే ఆయన ‘మాయదారి మల్లిగాడు’, ‘కిరాయి కోటిగాడు’ చూశాను. నా జీవితంలో.. నేను సినిమా రచయిత కావాలని 1975 డిసెంబర్‌ 23న హైదరాబాద్‌కి వచ్చా. రాఘవేంద్రరావు గారి ‘జ్యోతి’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చా. దాని రచయిత సత్యానంద్‌. కానీ, షూటింగ్‌ ప్రదేశంలో సత్యానంద్‌ లేరు. ఆయన చాలా బిజీ. సెట్స్‌లో కనిపించేవారు కాదు. అలా కుదరక మళ్లీ వెళ్లిపోయాను. 1979లో ఎంట్రీ, 80లో ఎన్టీఆర్‌ నన్ను గుర్తించారు. అలా ఐదారు సంవత్సరాలు పట్టింది మేము రచయితలు అవ్వడానికి. అలా వచ్చాక.. మద్రాస్‌లో ఉన్నా కూడా.. కేవలం ఫంక్షన్లప్పుడు మాత్రమే నటులు, దర్శకులు, రచయితలు కలుస్తుండేవారు. ఆ సినిమాకి రచయిత కాకపోయినా పిలుస్తుండేవారు. ఎందుకంటే హీరో చేసే చిత్రాలన్నీ ఒకే రచయిత రాయరు. నలుగురైదురు రాస్తారు. హీరో తరఫు పీఏలు రచయితలను పిలిచేవారు. అలావారిని ఒకట్రెండు సార్లు కలిశాను. అలా సత్యానంద్‌ గారిని కలిసినప్పుడు ఏమర్థమైందంటే.. సత్యానంద్‌ సౌమ్యుడు, మితభాషి. సామాన్యంగా సినిమా రచయితలు నేను, పోసాని కానీ ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఇతను ఆత్రేయ స్టైల్‌. ఆత్రేయలాగా మౌనంగా ఉండేవారు. మనం మాట్లాడుతుంటే వింటారే తప్ప సమాధానం చెప్పరు. ఆయన సమాధానం కోసం మనం వేచి చూడాలి. సాధారణంగా ఆత్రేయ గారు సీన్‌ రాస్తే వెంటనే ఇవ్వమని అడగరు. ఇంకో వెర్షన్‌ రాసివ్వమంటారు. షూటింగ్‌ ముందు ఇవ్వండి అదే తీస్తారు. కేవలం దర్శకులకు మాత్రమే తెలుసా.. రచయితలకు తెలియదా ఎలా తీస్తారో అని అంటుండేవారు.

వికీపిడియాలో తప్పు చూపిస్తుంది

సత్యానంద్‌ గారు మాతో పాటు సమానంగా, లేదంటే ఎక్కువగా రాసే ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే వికీలో మాత్రం 15 సినిమాలు మించి కనపడటం లేదు. కానీ మేము సినిమాకు  కథ రాశామా, మాటలు రాశామా, స్ర్కీన్‌ప్లే రాశామా.. ఇలా ఆధారాలు ఉన్నాయి. కానీ సత్యానంద్‌ వికీలో మాత్రం ఆయన పూర్తి చిత్రాల జాబితా కనిపించలేదు. ఇదే విషయాన్ని మొన్న ఆయన్ను అడిగినా కూడా ‘ఫర్వాలేదు సోదరా’ అని అన్నారు. మా అన్నయ్య పిలుస్తారు గోపాలకృష్ణా అని.. మళ్లీ సత్యానంద్‌ గారు పిలుస్తారు అలాగే. అప్పుడప్పుడు సోదరా అంటారు. మా రచయితల సంఘానికి అనేక పర్యాయాలు ఆయన్ని అధ్యక్షుడిని చేయాలని చూశాను. ‘వద్దు సోదరా. దానికి చాలా కావాలి. ఆ దివ్యశక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందరినీ ఒప్పించడం, నొప్పించకుండా ఒప్పించడం ఈ శక్తులు అన్ని నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎలాగో కొనసాగుతున్నావ్‌ కదా’ అంటుండేవారు. ఆయన గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకోగలిగానే తప్ప.. అధ్యక్షుడిగా మాత్రం తీసుకురాలేకపోయాను.

కథను నమ్మారు కాబట్టే.. కొదమ సింహం గెలిచింది

‘కొదమ సింహం’ చిత్రానికి మేము కలిసి పనిచేశాం. మురళీమోహన్‌ దర్శకత్వంలో వచ్చిందా చిత్రం. దానికి కథా మాటలు సత్యానంద్‌ గారు అందిస్తే.. స్ర్కీన్‌ప్లే మేము రాశాం. చిరంజీవి గారు సడెన్‌గా ఒకసారి ఫోన్‌ చేసి ‘వీజీపీకి వస్తారా’ అన్నారు. వెళ్తే ‘ఏమీ లేదు కథ బాగుంది. ఎక్కడో తప్పుంది అర్థం కావడంలేదు. దీన్ని మీరు చెబితే చాలు. కేవలం ఒక అభిప్రాయం కోసం మాత్రమే’ అని అన్నారు. సరిగ్గా ఇంటర్వెల్‌ అయ్యింది. అందులో సుడిగాలి పాత్ర మోహన్‌బాబు పోషించారు. మా అమ్మానాన్న ఎక్కడున్నారని చిరంజీవి మోహన్‌బాబుని కొడుతుంటే.. మోహన్‌బాబు పాత్ర ‘నాకు తెలుసు కానీ చెప్పను. ఎందుకంటే తెలిసిన తర్వాత నన్ను చంపేస్తావు’ అని ఆయన నవ్వుతారు. ఆయనతో పాటు అందరూ నవ్వుతున్నారు. ‘సినిమాలో ఉన్న తప్పు ఇదే’ అని చిరు అన్నారు. అదేంటి అన్నాను. ‘ఇంత అద్భుతమైన పాత్రని ఇక్కడితో ముగించకూడదు. అతడు చెప్పింది నిజమో అబద్ధమో తెలియాలి. అంటే అతడు బతికుండాలి’ అని అన్నారు చిరంజీవి. ‘దీనికి మీరు స్ర్కీన్‌ప్లే సమకూర్చాలి. ఆ పాత్ర బతికుంటే సెకెండ్‌ హాఫ్‌లో ఆర్డర్‌ మారిపోతుందని కాబట్టి మీరు స్ర్కీన్‌ప్లే చూడాలి’ అన్నారు. కొదమ సింహం చిత్రం ఎంత హిట్‌ అయిందో మీ అందరికీ తెలుసు. మోహన్‌ బాబు గారి పాత్రను ఆఖరికి కూడా చంపలేదు. క్లైమాక్స్‌లో మెడ మీద కాడి వేసుకొని గానుగా తిప్పుతూ ఉంటారు. జనమంతా నవ్వుకుంటూ బయటికి వచ్చారు. కథలో చిన్న దోషం ఉంటే మన కొంపలు ముంచేస్తాయి. కాబట్టి కథే ప్రాణం. కొదమ సింహంలో సుడిగాలి పాత్ర బతికింది కాబట్టి ఆ కథ అక్కడా బతికింది. ఇదే విషయాన్ని చిరంజీవి, సత్యానంద్‌ విశ్వసించారు కాబట్టి న్యాయం జరిగింది.

అదీ గొప్ప సహాయమే..

మేము ఎలా కొదమసింహానికి అభిప్రాయం చెప్పామో ఆయన కూడా ఈ మధ్య కొన్ని సినిమాల కథలు విని అభిప్రాయం చెప్పిన విషయాన్ని థ్యాంక్స్‌ కార్డ్‌లో వేస్తున్నారు. అది కూడా గొప్ప సహాయమే. ‘నారప్ప’లో కూడా థాంక్స్‌ కార్డ్‌లో సత్యానంద్‌ గారి పేరు కనపడింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని