Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య.. తొలి భావోద్వేగ లేఖ

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. గత నెల29న కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసిన పునీత్‌ మరణ వార్తను ఇప్పటికీ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు

Published : 18 Nov 2021 01:46 IST

ఇన్‌స్టాలో మొదటి పోస్ట్‌ పునీత్‌కు అంకితం

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. గత నెల29న కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసిన పునీత్‌ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు వస్తున్నారు. నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. పునీత్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖను పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండని ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి తొలిపోస్టును పునీత్‌కు అంకితమిచ్చారు.

‘‘శ్రీ పునీత్‌ రాజకుమార్‌ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు.. మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను ‘పవర్‌స్టార్‌’ చేసిన అభిమానులకు పునీత్‌ లేనిలోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు.  సినీప్రియులు మాత్రమే కాకుండా భారతదేశంతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పు(పునీత్‌)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం.. మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్‌ జీవించే ఉంటారు .మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు 

ఇట్లు,
అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని