Cinema News: వెన్ను తడుతూ దన్నుగా నిలుస్తూ

ఓ స్టార్‌ హీరో.. నిర్మాత అవతారమెత్తితే ఆ సినిమాలో తనే కథా  నాయకుడు కావడం రివాజు. ఇప్పుడు ఈ ట్రెండ్‌ మారుతోంది. ‘అంతా నేనే’, ‘అన్నీ నావే’ అనే ట్రెండ్‌కి మంగళం పాడి బడా హీరోలు కొత్తదారి పడుతున్నారు. కథ డిమాండ్‌ చేస్తే.. తమ సినిమాలో చిన్న హీరోలు, సాటి కథానాయకులకు వీరతాళ్లు వేస్తున్నారు. పాత్రను రక్తి కట్టించే ప్రతిభ ఉన్నవాళ్లను పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. దీని వెనకాల కొన్ని కారణాలతోపాటు మార్కెటింగ్‌ వ్యూహాలూ ఉన్నాయంటారు సినీ విశ్లేషకులు.

Updated : 16 May 2022 10:42 IST

ఓ స్టార్‌ హీరో.. నిర్మాత అవతారమెత్తితే ఆ సినిమాలో తనే కథా నాయకుడు కావడం రివాజు. ఇప్పుడు ఈ ట్రెండ్‌ మారుతోంది. ‘అంతా నేనే’, ‘అన్నీ నావే’ అనే ట్రెండ్‌కి మంగళం పాడి బడా హీరోలు కొత్తదారి పడుతున్నారు. కథ డిమాండ్‌ చేస్తే.. తమ సినిమాలో చిన్న హీరోలు, సాటి కథానాయకులకు వీరతాళ్లు వేస్తున్నారు. పాత్రను రక్తి కట్టించే ప్రతిభ ఉన్నవాళ్లను పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. దీని వెనకాల కొన్ని కారణాలతోపాటు మార్కెటింగ్‌ వ్యూహాలూ ఉన్నాయంటారు సినీ విశ్లేషకులు.

నిర్మాతలుగా అగ్ర కథానాయకులు

సాధారణంగా పెద్ద హీరోలకు భారీ మార్కెట్‌ ఉంటుంది. వాళ్లు ఇతర నిర్మాతల సినిమాలో నటిస్తూనే తమ అభిరుచి మేరకు చిత్రాలు నిర్మిస్తుంటారు. ఓ కథ, పాత్ర బాగా నచ్చుతాయి. కానీ వారి ఇమేజ్‌కు అది తగదు అప్పుడు కొత్త వారికి  అవకాశమిచ్చి ప్రోత్సహిస్తుంటారు. దీంతో కొందరు ప్రతిభావంతులకు అవకాశాలతో పాటు... పెద్ద హీరో అండ లభిస్తుంది. సినిమాకు మార్కెట్‌ ఉంటుంది. థియేటర్లుకు ప్రేక్షకులను రప్పించడం సులువు అవుతుంది. ఈ మధ్యకాలంలో అలా నిర్మాతలుగా మారిన కొందరు స్టార్‌ హీరోలు.. నిర్మిస్తున్న చిత్రాల గురించి ఓ లుక్కేయండి.


అడివి శేష్‌కి మహేష్‌బాబు అందలం

పాన్‌ ఇండియా చిత్రంగా తెర  కెక్కిన ‘మేజర్‌’ కోసం దేశమంతా  ఆసక్తిగా ఎదురు    చూస్తోంది. ఇందులో కథానాయకుడు అడివి శేష్‌ అయితే.. నిర్మించింది ప్రిన్స్‌ మహేష్‌బాబు. ముంబయి ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా నిర్మితమైందీ చిత్రం. ప్రేక్షకులకు నచ్చే కథాంశం, మాస్‌ని మెప్పించే పోరాటాలు ఇందులో ఉన్నాయి. మహేష్‌బాబు తలచుకుంటే తనే హీరోగా చేయొచ్చు. విలేకరులు ఇదేమాట అడిగితే.. ‘అన్నీ నేనే చేయాలనే స్వార్థం లేదు. ఈ పాత్ర కోసం అడివి శేష్‌ చాలా కష్టపడ్డాడు. సినిమా చివరి అరగంట చూశాక నాకు కన్నీళ్లాగలేదు. అన్నిరకాల ఎమోషన్స్‌ పండించాడు. బహుశా నేనైతే అంతలా చేయలేకపోయేవాడినేమో’ అంటూ చెప్పడం విశేషం. జూన్‌ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది   ‘మేజర్‌’. ఇందులో శేష్‌ సరసన సయీ మంజ్రేకర్‌ నటించింది.


నాని బాటే వేరు

నేచురల్‌ స్టార్‌గా తనకంటూ ఓ బాణీ సృష్టించుకున్న నటుడు నాని. తొమ్మిదేళ్ల కిందటే ‘వాల్‌పోస్టర్‌ సినిమా’ పేరుతో సొంత నిర్మాణసంస్థ ప్రారంభించాడు. ‘డీ ఫర్‌ దోపిడి’ నిర్మించాడు. తర్వాత కాజల్‌ అగర్వాల్‌, నిత్యామీనన్‌, రెజీనా, ఈషా రెబ్బలతో ‘అ’ అనే చిత్రం తీశాడు. ఆపై విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ‘హిట్‌’ కొట్టాడు. ఒక హీరో అయ్యి ఉండీ.. మరో హీరోకి అవకాశం ఇవ్వడం ఏంటని చాలామంది అడిగారు. ‘ఎవరి స్టైల్‌ వారికి ఉంటుంది. కొన్ని పాత్రలకు మనం న్యాయం చేయలేమని భావించినప్పుడు.. దానికి సరిపోయే కథానాయకులను ఎంచుకోవడంలో తప్పు లేదు’ అని సమాధానమిచ్చాడు. ఇదే ట్రెండ్‌తో ఇప్పుడు తను నిర్మాతగా, అడివి శేష్‌ హీరోగా ‘ది హిట్‌: సెకండ్‌ కేస్‌’తో జులై 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌధురి కథానాయిక.


అక్షయ్‌ని ఎంచుకున్న సూర్య

మేటి నటుడిగానే కాదు.. ఉత్తమాభిరుచి ఉన్న నిర్మాతగా సూర్యకి తమిళంలో మంచి పేరుంది. ‘ఎయిర్‌ దక్కన్‌’ వ్యవస్థాపకుడు   జి.ఆర్‌.గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఆయన నిర్మించిన ‘సూరారై పోట్రు’ తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. ‘ఆకాశమే నీ హద్దురా’ అంటూ తెలుగులోనూ మంచి    విజయమే దక్కించుకున్నాడు. దీన్ని ఇప్పుడు హిందీలో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పునర్నిర్మిస్తున్నాడు. తను హీరోగా నటించకుండా మరో స్టార్‌ని రంగంలోకి దించడమేంటని చాలామందికి సందేహం. సూర్య నటుడిగా, నిర్మాతగా ‘ఎత్తార్కుమ్‌ తునిందవాన్‌’, ‘సూర్య 41’, ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’, ‘ఓ మై డాగ్‌’, ‘విరుమాన్‌’ తదితర చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నాడు. దీంతో బాలీవుడ్‌ విపణిలోకి దూసుకురావడానికి అక్షయ్‌ను మించి అస్త్రం లేదనుకున్నాడు. అందుకే అతనితో సినిమాను పునర్నిర్మిస్తున్నాడు. తమిళ మాతృకకి దర్శకత్వం వహించిన సుధా కొంగరనే హిందీ చిత్రానికీ దర్శకురాలు. అక్షయ్‌కి జోడీగా రాధికా మదన్‌ నటించనుంది. ఈ సినిమాకి స్క్రిప్ట్‌ పని పూర్తైనట్టు సుధా చెప్పారు.


కమల్‌ మెచ్చిన సాయిపల్లవి

మల్‌  హాసన్‌ అంటేనే నటనకు పెట్టింది పేరు. ఆయన ఇంట్లో ఇద్దరు నట వారసురాళ్లు ఉన్నారు. అలాంటిది కమల్‌  ఏరికోరి ‘ఫిదా’ హీరోయిన్‌ సాయిపల్లవిని తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించనున్న కొత్త సినిమాలో ముఖ్య పాత్రకి ఎంచుకున్నారు. ‘ఇది నటనకు అత్యధిక స్కోప్‌ ఉన్న పాత్ర. సాయిపల్లవి అయితేనే న్యాయం చేయగలదని భావించా’ అంటూ సామాజిక  మాధ్యమాల్లో అసలు విషయం పంచుకున్నారు. రాజ్‌కుమార్‌ పెరియాస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. శివకార్తికేయన్‌ కథానాయకుడు.

ఈ ట్రెండ్‌ని ఇతర హీరోలూ అందిపుచ్చుకున్నారు. గతంలో కథానాయకుడు నితిన్‌ అక్కినేని అఖిల్‌తో ‘అఖిల్‌’ని తెరకెక్కించాడు. విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారి, దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని హీరోగా పెట్టి సరికొత్త ప్రయోగం చేశాడు. ‘మీకు మాత్రమే చెబుతా’ అనే సినిమా తీశాడు. రానా దగ్గుబాటి ‘బొమ్మలాట’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’ లాంటి ప్రయోగాత్మక చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించి కొత్తవాళ్లకు అవకాశమిచ్చాడు.   తమిళంలో ధనుష్‌ ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించి అతన అభిరుచిని తెలియజేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని