Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌

సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వి. జయరామ్‌ కన్నుమూశారు.

Updated : 21 May 2021 08:13 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం. కరోనా మహమ్మారికి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వి. జయరామ్‌ కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా, చికిత్స పొందుతూనే గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తెలుగులో అగ్ర నటులు నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్‌గా  పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘పెళ్లి సందడి’తో సహా అనేక చిత్రాలు ఆయన కెమెరా కాన్వాస్‌ నుంచి జాలువారినవే.జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..

జయరామ్‌ పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఆయన ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు జయరామే సినిమాటోగ్రాఫర్. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడటంతో చెన్నై రైలెక్కారు. పాండీబజార్‌లో తెలుగు వాళ్లుంటారని అక్కిడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకుంటే దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు. ‘ఏం చేస్తావ్?’ అంటే ‘నాకేమీ తెలియదు’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీ. మేనేజర్‌ని పిలిచి ‘ఇతనికో జాబ్ ఇవ్వు’ అన్నారు. అలా ఆ క్లబ్ లో క్యాషియర్ స్థాయికి ఆయన ఉద్యోగం ఎదిగింది. ఆ తర్వాత అసిస్టెంట్‌ కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగారు.

ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సహంతోనే ఆయన అంచెలంచెలుగా ఎదగ గలిగారు. జయరామ్‌ కెమెరామన్‌గా తొలి చిత్రం  చిరంజీవిది కావడం విశేషం. సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. సినిమా పేరు కూడా చిరంజీవే. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’ సినిమాటోగ్రాఫర్‌గా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగును వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి ‘1921’ సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరామ్‌. ఇది పీరియాడికల్ సినిమా. జయరామ్‌కు అవార్డును సంపాదించిపెట్టిన సినిమా ఇది.  నటి సౌందర్య ఆఖరి చిత్రం ‘శివశంకర్’కు కూడా ఆయన పనిచేశారు. ఇందులో ఆమె చనిపోయే సన్నివేశాలను కూడా ఆయనే చిత్రీకరించారు. రెండ్రోజుల్లో వస్తానన్న సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని ఓ ఇంటర్వ్యూలో జయరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను చూడాలన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు, ఆఖరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు. కె. రాఘవేంద్రరావు సినిమాలకూ, మోహన్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరామ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. జయరామ్‌  మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని