అమెరికా వెళ్తున్నారా..?

తమ దేశానికి వచ్చే విదేశీయులకు తప్పనిసరిగా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని అమెరికా ప్రకటించింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న

Updated : 28 Oct 2021 06:57 IST

టీకా ధ్రువీకరణ పత్రం తప్పనిసరి

కొవిన్‌ పోర్టల్‌లో, వాట్సప్‌లోనూ పొందొచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: తమ దేశానికి వచ్చే విదేశీయులకు తప్పనిసరిగా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని అమెరికా ప్రకటించింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టు కూడా ఉండాలని స్పష్టంచేసింది. చాలా దేశాలు ఇవే నిబంధనలు విధిస్తున్నాయి. మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని ప్రముఖ ఆలయాల సందర్శనకు ధ్రువీకరణ పత్రం చూపించాలి. లేదా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రమైనా తప్పనిసరి. అయితే టీకా ధ్రువీకరణ పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఒకే డోసు తీసుకున్నట్లు పత్రం వస్తుంటే.. మరికొందరికి ఆ సమాచారమూ అందడం లేదు.

ఎందుకిలా?

కొందరు టీకా రెండు డోసులను వేర్వేరు కేంద్రాల్లో తీసుకున్నారు. టీకా తీసుకునేముందు కొవిన్‌ పోర్టల్‌లో లేదా ఆరోగ్యసేతులో నమోదు చేసుకోవాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు భారీఎత్తున టీకాలు అందించే క్రమంలో సొంత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాయి. ఒక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇచ్చి, దాని ఆధారంగా టీకాలు ఇచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. ఇలాంటి వారికి తొలి డోసు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. నిమ్స్‌లో టీకా కార్యక్రమం ప్రారంభించే సమయంలో వైద్యులు, సిబ్బంది మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా చాలామంది టీకాలు తీసుకున్నారు. వారి పేర్లు ఆరోగ్యసేతు/కొవిన్‌ పోర్టల్‌లో నమోదు కాలేదు. రెండు డోసులు తీసుకున్నా ధ్రువపత్రం అందలేదు.

సర్టిఫికెట్‌ పొందండిలా..

కొవిన్‌ లేదా ఆరోగ్యసేతు పోర్టల్‌లో నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌తో ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం ఉంది. లేదా కొవిన్‌ సహాయ కేంద్రం నంబర్‌ 9013151515కు వాట్సప్‌లో ‘సర్టిఫికేట్‌’ అని నమోదు చేయాలి. కొవిన్‌ పోర్టల్‌లో నమోదైన నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. రెండు డోసులు పూర్తయి ఉంటే.. పీడీఎఫ్‌ రూపంలో వాట్సప్‌కు సర్టిఫికేట్‌ వస్తుంది. లేదంటే ‘యూ ఆర్‌ నాట్‌ రిజిస్టర్డ్‌’ అనే సమాచారం పంపుతుంది. ధ్రువీకరణ పత్రం రానివారు వివరాల కోసం టీకా తీసుకున్న కేంద్రాల్లో సంప్రదిస్తే సాంకేతిక సమస్యలను గుర్తించి సరిదిద్దే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని