
అధిష్టానాన్ని ఎలాంటి పదవి కోరలేదు: పైలట్
జైపుర్ విమానాశ్రయంలో ఘనస్వాగతం
జైపుర్: కాంగ్రెస్ తిరుగుబాటు నేత, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సాయంత్రం జైపుర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో విభేదించి సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో నెల రోజులుగా హరియాణాలోని ఒక రిసార్టులో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సచిన్ వర్గం డిమాండ్లను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కే.సీ. వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో రాజస్థాన్లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సచిన్ పైలట్ జైపుర్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను ఎలాంటి పదవి డిమాండ్ చేయలేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలానే రాజకీయాల్లో సమస్యలు, విధానాలపరంగా పనిచేయాలని, వ్యక్తిగత శత్రుత్వం ఉండకూడదని అన్నారు. పార్టీ నాయకత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా తాము మాట్లాడలేదని, తమ గురించి కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, ఎన్నో రకాల ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ ఈ 30 రోజులు తాము ఎంతో ఓపికతో వ్యవహరించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మాత్రమేనని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.