Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు

వైకాపా శ్రేణుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే సాక్షిగా ఇరువర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటనతో నాగాయలంకలో ఉద్రిక్తత నెలకొంది.

Published : 29 Jan 2023 01:16 IST

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంకలో వైకాపా శ్రేణుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్‌ పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరితో పాటు ఆయన అనచరులు వచ్చారు. ఈక్రమంలో ఎంపీ బాలశౌరి వర్గీయులపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వివాదం సద్దుమణగలేదు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్‌ను వైకాపా నేతలు లాక్కుని పగలగొట్టారు.

నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో నాబార్డు ఛైర్మన్‌ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీ, బాలశౌరి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి వర్గీయుల మధ్య ఏర్పడిన చిన్న వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం చెప్పులతో కొట్టుకుంటూ, చెంప దెబ్బలతో దాడికి దిగారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే రమేష్‌బాబుపై కూడా ఎంపీ వర్గీయులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రతి దాడి చేశారు.

ఈ దశలో సంఘటనలను చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు ఎక్కువ చొరవ చూపించడంతో ఎమ్మెల్యే వర్గీయులు దాడికి దిగి కెమెరాను ధ్వంసం చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది. దీనిని మనసులో ఉంచుకున్న ఇరువర్గాలు మళ్లీ నాగాయలంక వేదికగా తలపడ్డాయి. ఈ సంఘటనపై ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పందిస్తూ.. ఎంపీ బాలశౌరికి తనకు మధ్య ఎటువంటి వర్గ విభేదాలు లేవన్నారు. ఒకే వర్గంలా కలసి పనిచేస్తునామని చెప్పారు. ఎంపీ బాలశౌరి వెంట వచ్చిన గరికిపాటి శివ కారణంగా తోపులాట జరిగిందన్నారు. కార్యకర్తలకు చెప్పి తోపులాటను ఆపేశామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని