చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు పది వారాలు వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది.

Updated : 08 May 2024 09:50 IST

ఈనాడు, దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. 17ఏ అంశంపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువడ్డాక దీన్ని పరిశీలిస్తామని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. విచారణలో ఏపీ సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ 17ఏ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ప్రతిపాదించిన కేసు పెండింగ్‌లో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జస్టిస్‌ త్రివేది స్పందిస్తూ ఆ అంశం తేలాక ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని చెప్పొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కల్పించుకొని ఆ విషయాన్ని తాము కోర్టుకే వదిలిపెడుతున్నామని, ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైందని చెప్పారు. సెక్షన్‌-17ఏ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోనందున కోర్టు ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

తమకు 17ఏ ఆధారంగా బెయిల్‌ ఇవ్వలేదని, ఆ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించక ముందే హైకోర్టు బెయిల్‌ మంజూరుచేసినట్లు తెలిపారు. తాము 52 రోజులు జైల్లో ఉండి వచ్చాక ఛార్జిషీట్‌ దాఖలుచేశారని, ప్రస్తుతం దాని పరిస్థితోంటో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు. జస్టిస్‌ త్రివేది జోక్యం చేసుకుంటూ 17ఏపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువరించేవరకూ ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేస్తామన్నారు. ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ ఛార్జిషీట్‌కు సీఆర్‌పీసీ 173(8) అనుమతి తీసుకున్నామని, కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తోందని చెప్పారు. 17-ఏ అంశాన్ని తాము జులైలో మెన్షన్‌ చేస్తామన్నారు. సిద్ధార్థలూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసును రాష్ట్రప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని సీఐడీ తరఫు న్యాయవాది చెబుతున్నారని, అదే తమకు సమస్య అన్నారు. రంజిత్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం అంటే దర్యాప్తు అధికారి అని వివరణ ఇచ్చారు. దాంతో లూథ్రా విభేదించారు.

హైకోర్టు బెయిల్‌ ఇస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న అభిప్రాయాలేవీ విచారణకు అడ్డుకావని, ఎలాంటి ప్రభావానికి లోనుకాకుండా దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగించుకోవచ్చని చెప్పిందని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ త్రివేది కేసును పది వారాలకు వాయిదా వేస్తున్నామని చెప్పి విచారణ ముగించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదని, వేసవి సెలవుల తర్వాత వింటామని పేర్కొన్నారు. 17ఏ కేసును త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయడంపై తాము సెలవుల తర్వాత సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేస్తామని రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని