Congress: రేవంత్‌-కోమటిరెడ్డి భేటీ.. వీహెచ్‌ అలక.. గాంధీభవన్‌లో ఆసక్తికర సన్నివేశాలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌కు వచ్చారు.

Updated : 20 Jan 2023 19:11 IST

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ ఠాక్రే  ‘హాథ్‌ సే హాథ్‌’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాసేపు వీరిద్దరూ సీరియస్‌గా చర్చించుకోవడం కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి రేపింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత .. టీపీసీసీ, కోమటిరెడ్డి మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకోవడంతో పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలూ ఏం మాట్లాడుకున్నారా? అని మీడియాతో పాటు, పార్టీ నేతలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘మాణిక్‌రావు ఠాక్రే నాకు ఫోన్‌ చేశారు.. అందుకే ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చా. నా నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇటీవల రాలేకపోయా. నేనెప్పుడూ గాంధీ భవన్‌కు రానని చెప్పలేదు. కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తేవాలో భేటీలో చెబుతా. ఖమ్మం లాంటి సభలు కాంగ్రెస్‌ వందల్లో పెట్టింది. ఎన్ని సభలు పెట్టినా కేసీఆర్‌ ఏం చేయలేరు’’ కోమటిరెడ్డి అన్నారు.

గాంధీ భవన్‌ నుంచి అలిగి వెళ్లిపోయిన వీహెచ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావు గాంధీ భవన్‌ నుంచి అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ క్రికెట్‌ టోర్నీకి ఠాక్రేను వీహెచ్‌ ఆహ్వానించారు. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోతున్నట్టు ఠాక్రే తెలిపారు.  ఠాక్రే.. వీహెచ్‌ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ జోక్యం చేసుకున్నారు. దీంతో వీహెచ్‌, మహేశ్‌కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమంతరావు గాంధీ భవన్‌ నుంచి అలిగి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని