కోహ్లీ మంచి కెప్టెనే కానీ రోహిత్‌ అత్యుత్తమం 

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ మరోసారి బోల్తాపడగా, ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచీ టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి...

Updated : 24 Nov 2020 14:59 IST

టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌ ఎవరంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ మరోసారి బోల్తాపడగా, ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచీ టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో ఎప్పటి నుంచో కోహ్లీ సారథ్యాన్ని విమర్శిస్తున్న మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన వ్యాఖ్యలకు పదునుపెట్టాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో ఆకాశ్‌చోప్రా, పార్థివ్‌ పటేల్‌తో మాట్లాడాడు. కోహ్లీ మంచి కెప్టెనే అయినా రోహిత్‌ అత్యుత్తమం అని, వాళ్లిద్దరి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నాడు.

ఆపై స్పందించిన ఆకాశ్‌ చోప్రా ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అభిప్రాయాలు, విశ్లేషణలతో జట్టును మార్చాల్సిన అవసరం లేదన్నాడు. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేసినా దాని ఆధారంగా మార్పులు చేయాల్సిన పరిస్థితి లేదని పేర్కొన్నాడు. అలాగే టీమ్‌ఇండియా కెప్టెన్‌గా విరాట్‌ ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో మంచి ప్రదర్శనే చేశాడని, అందులో ఎలాంటి తప్పు లేదన్నాడు. అనంతరం గంభీర్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు నటరాజన్‌, వాషింగ్టన్ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఆటగాళ్ల ఎంపిక సరైంది కాదన్నాడు. ఐపీఎల్లో వారి ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేసినప్పుడు.. కెప్టెన్సీ విషయంలోనూ ఆ నియమం ఎందుకు పాటించరని ప్రశ్నించాడు. లేకపోతే ఐపీఎల్‌ ప్రదర్శనను టీమ్‌ఇండియా ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవద్దని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. చివరగా పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ కన్నా రోహితే మ్యాచ్‌ పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకుంటాడని, ఒత్తిడిలోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని