Virat Kohli: కోహ్లీ ఇంతకుముందు ఎన్నడూ ఇలా రిస్క్‌ తీసుకునేవాడు కాదు.. : చోప్రా

ఇంతకుముందు పరుగుల వరద పారించిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఇటీవలి కాలంలో రిస్క్‌ లేకుండా ఆడలేకపోతున్నాడని, దాంతో జట్టు కాస్త ఇబ్బంది...

Published : 18 Feb 2022 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవలి కాలంలో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఆటతీరుతో జట్టు కాస్త ఇబ్బంది పడుతోందని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. క్రమశిక్షణ అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిందని, కానీ ఇప్పుడు అది కోల్పోయాడని అన్నాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ(17) పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో ఫీల్డర్‌ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్వల్ప వ్యవధిలో టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది. అయితే, ఆ షాట్‌ ఆడినందుకు కోహ్లీ కూడా నిరాశ చెందాడని చోప్రా తాజాగా పేర్కొన్నాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్‌ తీరుపై స్పందించాడు.

‘విరాట్‌ కోహ్లీ ఇంతకుముందు ఎన్నడూ ఇలా రిస్క్‌ చేసేవాడు కాదు. సిక్సర్‌ కొట్టే అవసరం లేకపోతే అస్సలు ప్రయత్నించేవాడే కాదు. సింగిల్స్‌, బౌండరీలతోనే పరుగులు రాబట్టేవాడు. ఎప్పుడూ రిస్క్‌ తీసుకొని షాట్లు ఆడేవాడు కాదు. కానీ, ఇప్పుడు అలా ఆడలేకపోతున్నాడు. అది కాస్త ఆందోళన కలిగించే అంశం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్‌ సిక్సర్‌గా వెళితే ఏమయ్యేదని అడిగితే.. ఏం కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క సిక్సర్‌తోనే మ్యాచ్‌ గెలిచేది కాదు. కానీ, కోహ్లీ లాంటి ఆటగాడు కీలక సమయంలో ఔటైతే అది జట్టుపై ప్రభావం చూపుతుంది’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా, కోహ్లీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అభిమానులు అతడి ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని