మహా పోరు.. మజా ఫుల్లు

భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్‌ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ   మరో సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ బెర్తు సాధించాలన్న పంతం భారత్‌ది.

Updated : 08 Feb 2023 07:09 IST

భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్‌ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ  మరో సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ బెర్తు సాధించాలన్న పంతం భారత్‌ది.

ఇరు జట్లూ మంచి ఫామ్‌లో ఉన్నాయి. రెండింటి బలాబలాలు సమం. ఇటూ అటూ స్టార్లకు కొదవ లేదు. గురువారం మొదలయ్యే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌ను చూసేందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

ఈనాడు క్రీడావిభాగం

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో తలపడే యాషెస్‌నే అత్యుత్తమ సిరీస్‌గా పరిగణిస్తుంటారు. తమ వరకు దాన్నిమించి సిరీస్‌ లేదంటారు. ఆ విజయాన్ని గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారుతోంది. భారత్‌లో ఆడబోయే టెస్టు సిరీస్‌ను యాషెస్‌తో సమానం అని కొందరంటుంటే.. ఇందులో విజయం సాధిస్తే యాషెస్‌ను మించిన విజయం అవుతుందని కొందరంటున్నారు. ఈ సిరీస్‌ ప్రాధాన్యమేంటో చెప్పడానికి ఇంతకంటే రుజువు కావాలా? వరుసగా రెండు పర్యాయాలు తమ గడ్డపై టీమ్‌ఇండియా సిరీస్‌లు సాధించి చరిత్ర సృష్టించగా.. ఆసీస్‌ మాత్రం 2004 తర్వాత భారత్‌లో సిరీస్‌ విజయం దక్కని అసంతృప్తితో ఉంది. రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌లో నిలకడగా విజయాలు సాధిస్తూ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. భారత్‌లో సిరీస్‌ సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆస్ట్రేలియాకు దాని గడ్డపై పరాభవం మిగిల్చిన భారత్‌.. ఇప్పుడు సూపర్‌ ఫామ్‌తో తమ దేశానికి వచ్చిన ఆ జట్టును ఇక్కడా దెబ్బ కొట్టి ఆధిపత్యాన్ని చాటాలని భారత్‌ చూస్తోంది.

తేల్చేది వీళ్లే..

ఈ సిరీస్‌లో స్పిన్నర్లదే అత్యంత కీలక పాత్ర అని, సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించేది వాళ్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు జట్లలో నలుగురు చొప్పున స్పిన్నర్లు జట్టులో ఉండడం విశేషం. ఇరు జట్లూ తుది జట్లలో కనీసం ఇద్దరు స్పిన్నర్లను దించడం ఖాయం. భారత్‌ ముగ్గురిని ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అశ్విన్‌.. ఆస్ట్రేలియా తరఫున నిలకడగా రాణిస్తున్న లైయన్‌ మధ్య పోరు ఆసక్తి రేకెత్తించేదే. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. భారత జట్టులో ఇంకా కుల్‌దీప్‌, జడేజా, అక్షర్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్లున్నారు. వీరికి భారత పిచ్‌లు కొట్టిన పిండే. వీరిలో ఎవరు తుది జట్టులో ఉన్నా పిచ్‌ కొంచెం సహకరిస్తే కంగారూలకు ఇబ్బంది కలిగించడం ఖాయం. ఆస్ట్రేలియా జట్టులో అగార్‌, స్వెప్సన్‌, మర్ఫీల రూపంలో మరో ముగ్గురు స్పిన్నర్లున్నారు. వీరు ప్రతిభావంతులే అయినా.. భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. మరి వాళ్లు ఎంతమేర సత్తా చాటుతారో చూడాలి.

నువ్వానేనా?

భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అమితాసక్తిని రేకెత్తిస్తుండడానికి ఇరు జట్ల బలాబలాలు సమానంగా కనిపిస్తూ, మ్యాచ్‌లు హోరాహోరీగా సాగేలా కనిపిస్తుండడం కూడా ఓ కారణమే. రెండు జట్లకూ అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వారు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు కోహ్లి, పుజారా, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్‌ బ్యాటర్లు భారత జట్టులో ఉన్నారు. కోహ్లి ఒకప్పటి స్థాయి ఫామ్‌లో లేకపోయినా.. ఇటీవల అతడి ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. తనలోని మేటి బ్యాటర్‌ను అతను మళ్లీ ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో బయటికి తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా కూడా ఈ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నారు. రోహిత్‌కు బ్యాటర్‌గానే కాక కెప్టెన్‌గా ఈ సిరీస్‌ కీలకం. రాహుల్‌ కూడా తన స్థాయిని, సత్తాను చాటాల్సి ఉంది. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. స్టీవ్‌ స్మిత్‌ ఆ జట్టుకు అతి పెద్ద బలం. టాంపరింగ్‌ కుంభకోణం వల్ల మధ్యలో కెరీర్‌ కొంత దెబ్బ తిన్నా.. ఇటీవల తన పతాక స్థాయిని అందుకుని పాత స్మిత్‌ను గుర్తుకు తెస్తున్నాడతను. భారత్‌లో అతడికి గొప్ప రికార్డుంది. అనుభవజ్ఞుడు వార్నర్‌కు ఈ సిరీస్‌ ఎంతో కీలకం. చరమాంకంలో ఉన్న అతను.. భారత్‌పై సత్తా చాటి కెరీర్‌కు ఘనమైన ముగింపునివ్వాలనుకుంటున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఖవాజా, మేటి బ్యాటర్‌గా ఎదుగుతున్న లబుషేన్‌ భారత పర్యటనలో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. స్పిన్నర్లను ఆడడం కఠిన సవాలుగా మారబోయే ఈ సిరీస్‌లో ఇరు జట్లలోని స్టార్లలో ఎవరు మేటిగా నిలుస్తారన్నది ఆసక్తికరం.

వారికి చెలగాటం..

2021-23 డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆస్ట్రేలియాది తిరుగులేని ఆధిపత్యం. ఆ జట్టు 75.56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌ 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సిరీస్‌లో ఓడినా ఆ జట్టు ఫైనల్‌ బెర్తుకు వచ్చిన ముప్పేమీ లేనట్లే! కానీ భారత్‌ మాత్రం ఈ సిరీస్‌ గెలిస్తేనే ఫైనల్‌ చేరుతుంది. కాబట్టి ఈ సిరీస్‌ ఆసీస్‌కు చెలగాటం, భారత్‌కు ప్రాణ సంకటం అన్నట్లే. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముంగిట జరిగే చివరి సిరీస్‌ కావడంతో దీనిపై మిగతా జట్ల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి క్రికెట్‌ ప్రపంచమంతా ఈ సిరీస్‌ను ప్రత్యేక ఆసక్తితో చూస్తుందనడంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని