అదే వార్నర్కు చివరి టెస్టు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడే కాదు.
లండన్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడే కాదు. జనవరిలో సొంత మైదానంలో పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు అతడు తెలిపాడు. అంటే ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు అతడు అందుబాటులో ఉండడన్న మాట. ప్రస్తుతం లండన్లో ఉన్న వార్నర్ భారత్తో డబ్ల్యూటీసీ ఫైనల్కు కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్తో అయిదు మ్యాచ్ల యాషెస్ సిరీస్లో ఆడతాడు. శనివారం అతడు విలేకరులతో మాట్లాడుతూ తన టెస్టు రిటైర్మెంట్ ఆలోచన గురించి చెప్పాడు. పరుగులు సాధించి ఇలాగే జట్టులో కొనసాగినా.. వెస్టిండీస్తో సిరీస్లో ఆడనని కచ్చితంగా చెప్పగలనని వార్నర్ అన్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా తుది జట్టులో తన స్థానానికి గ్యారెంటీ లేదని అతడు అంగీకరించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతానని అతడు స్పష్టం చేశాడు. ‘‘ఇంతకుముందు కూడా చెప్పాను. 2024 టీ20 ప్రపంచకప్లో నా చివరి మ్యాచ్ ఉండొచ్చు’’ అని అన్నాడు. 36 ఏళ్ల వార్నర్ ఇటీవల టెస్టుల్లో సరైన ఫామ్లో లేడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.