ICC Rankings: విరాట్ కోహ్లీ సేమ్‌ ప్లేస్‌.. నంబర్‌వన్‌లోకి బాబర్‌ అజామ్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ప్రపంచకప్‌లో మూడు అర్ధశతకాలు సాధించిన...

Published : 03 Nov 2021 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ప్రపంచకప్‌లో మూడు అర్ధశతకాలు సాధించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్‌ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లాడు. 834 రేటింగ్‌తో తొలి స్థానం ఆక్రమించాడు. 2018లో తొలిసారి మొదటి స్థానం సాధించిన బాబర్‌.. ఇప్పుడు మళ్లీ అదే ప్లేస్‌లోకి రావడం విశేషం. ప్రస్తుతం వన్డేల్లోనూ బాబర్‌ అజామ్‌దే ఫస్ట్‌ ర్యాంక్‌. టీ20ల్లో రెండో స్థానం డేవిడ్ మలన్ (798), మూడులో ఆరోన్‌ ఫించ్‌ (733), నాలుగైదు స్థానాల్లో మహమ్మద్‌ రిజ్వాన్‌ (731), విరాట్ కోహ్లీ (714) నిలిచారు. టాప్‌-10లో భారత్‌ నుంచి టీమ్ఇండియా కెప్టెన్‌ కోహ్లీ (5వ స్థానం), కేఎల్ రాహుల్ (8వ స్థానం) సంపాదించారు. గతవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ వీరిద్దరివి ఇవే ర్యాంకులు. మరోవైపు శ్రీలంకపై అద్భుత శతకం బాదిన జోస్‌ బట్లర్‌ (670) ఎనిమిది ర్యాంకులను మెరుగుపరుచుకుని టాప్‌-10లోకి వచ్చేశాడు. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ కూడా ఆరు నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్‌ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానంలోకి చేరాడు. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం టాప్‌-10 జాబితా నుంచి దిగజారే ప్రమాదముంది.

ఇక టీ20 బౌలర్ల జాబితాలో లంక ఆల్‌రౌండర్‌ వహిందు హసరంగ (776 రేటింగ్) మొదటి స్థానం సాధించాడు. గతవారం వరకు నంబర్‌వన్‌గా ఉన్న సౌతాఫ్రికా స్పిన్నర్ తాబ్రైజ్‌ షంసి (770) రెండో స్థానానికి పడిపోయాడు. అదిల్‌ రషీద్ (730) మూడో స్థానం, రషీద్‌ ఖాన్‌ (723)నాలుగు, ముజీబ్ (703) ఐదో స్థానంలో నిలిచారు. తొలి ఐదు స్థానాలు సాధించిన బౌలర్లందరూ స్పిన్నర్లే కావడం విశేషం. కివీస్‌ బౌలర్‌ ఆన్రిచ్‌ నార్జే ఏకంగా పద్దెనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని ఏడో ప్లేస్‌లోకి దూసుకువవచ్చాడు. క్రిస్‌ జొర్డాన్(తొమ్మిదో స్థానం)‌, ఐష్‌ సోధీ (పదోవ స్థానం) టాప్‌-10లోకి వచ్చారు. ఆల్‌రౌండర్ల జాబితాలో నబీ (271 రేటింగ్‌), షకిబ్‌ (271) ఒకే రేటింగ్‌ సాధించారు. స్వల్ప తేడాతో షకిబ్‌కే తొలి స్థానం దక్కింది. రెండులో నబీ, మూడులో స్మిత్ (175), నాలుగులో వహిందు హసరంగ (172), జీషన్‌ (160) ఐదో స్థానంలో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని