MSD - Jadeja : రవీంద్రుడిని మహేంద్రుడు మరో విరాటుడిగా తీర్చిదిద్దుతాడా?

అభిమానులు ఊహించని విధంగా ‘మిస్టర్ కూల్’ నిర్ణయం తీసేసుకున్నాడు. నాయకుడిగా, ఆటగాడిగా...

Updated : 26 Mar 2022 12:19 IST

కెరీర్‌పరంగా పక్కా ప్రణాళిక.. నాయకుడిగా, ఆటగాడిగా ఎప్పుడు వైదొలగాలనే దానిపై పూర్తి క్లారిటీ.. వారసుడి ఎంపిక నుంచి తెర వెనుక కీలక పాత్ర పోషించడం వరకు అన్నీ తానై నడిపించే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరోసారి తన విలక్షణతను చాటిచెప్పాడు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలను తీసుకోవడం.. వాటిని వేగంగా అమలుపరచడంలో ఎంఎస్‌డీకి మరెవరూ సాటి రారని నిరూపించాడు. అటు భారత్‌ క్రికెట్‌ జట్టు అయినా.. ఇటు చెన్నై అయినాసరే కమిట్‌మెంట్‌తో కర్తవ్యాలను నిర్వర్తించడమే ధోనీ స్పెషాలిటీ.. జడేజాను చెన్నై సారథిగా ఎంపిక చేసిన క్రమంలో అభిమానుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. రవీంద్రుడిని మహేంద్రుడు మరో విరాటుడిగా తీర్చిదిద్దుతాడా..?

మరో రెండు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జట్లంతా సాధన చేస్తూ తలమునకలు కాగా... ఎంఎస్ ధోనీ మాత్రం తదుపరి కెప్టెన్‌ ఎవరనే దానిపై దృష్టిపెట్టినట్టున్నాడు. ఈ సీజన్‌ వరకు ధోనీనే సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావించిన అభిమానులను షాక్‌కు గురి చేస్తూ కెప్టెన్‌గా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంతే ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ముందే అనుకున్న విధంగా తన వారసుడిగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకే కెప్టెన్సీ బ్యాటర్‌ను అందించాడు. ఈ మేరకు చెన్నై యాజమాన్యం అధికారికంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. టీమ్‌ఇండియాలోనూ, చెన్నై తరఫున ధోనీ నాయకత్వంలో జడేజా రాటుదేలాడు. 

ధోనీ నాయకత్వంలోనే అరంగేట్రం..

ధోనీ సారథ్యంలోనే టీమ్‌ఇండియాలోకి రవీంద్ర జడేజా అరంగేట్రం చేశాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన జడేజా అనతికాలంలోనే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. లోయర్‌ఆర్డర్‌లో ఎన్నోసార్లు విలువైన ఇన్నింగ్స్‌లను ఆడాడు. జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ అతడిలోని టాలెంట్‌ను ధోనీ బయటకు తెచ్చాడు. ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొని మ్యాచ్‌లను మలుపు తిప్పే సామర్థ్యం సొంతం చేసుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లను తీస్తూ ధోనీ మనసును గెలుచుకున్న జడేజా చెన్నై జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. గత సీజన్‌లోనూ టైటిల్‌ను నెగ్గడంలో జడేజానే కీలకం. బ్యాటింగ్‌లో 16 మ్యాచులకుగాను 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 13 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు. అందుకే జడేజాను ఎంఎస్ ధోనీ కంటే భారీ మొత్తం ఇచ్చి మరీ రిటెయిన్‌ చేసుకుంది.

విరాట్‌కు మార్గం చూపాడు..

దాదాపు పదేళ్ల నుంచి (2012) చెన్నై జట్టుతోపాటు జడేజా ఉంటున్నాడు. మధ్యలో రెండేళ్లపాటు చెన్నైపై బ్యాన్ పడటంతో పుణె జట్టు తరఫున ఆడాడు. ఎంఎస్ ధోనీ, స్టీవ్‌ స్మిత్ సారథులుగా వ్యవహరించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండే రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం వెనుక ‘మిస్టర్ కూల్‌’ ధోనీ మాస్టర్‌ప్లాన్‌ ఉందంటున్నారు విశ్లేషకులు. టీమ్‌ఇండియా సారథిగా వైదొలిగే సమయంలోనూ విరాట్ కోహ్లీని ఇదేవిధంగా సిద్ధం చేసి మరీ ధోని నిష్క్రమించాడు. అందుకే విరాట్ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కఠిన సవాళ్లను ఎదుర్కొని మరీ భారత జట్టును ముందుకు నడిపించాడు. అతడి హయాంలో ఐసీసీ టైటిల్‌ను నెగ్గలేదనే కారణం తప్పించి.. ఇటు టెస్టులు, వన్డేలు సహా పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు గర్వించదగిన విజయాలను అందించాడు.

వెనుకుండి సూచనలు, సలహాలు ఇస్తాడు..

అదే విధంగా ఇప్పుడు కూడానూ సూచనలు, సలహాలు ఇస్తూ జడేజా నాయకుడిగా రాటుతేలేలా చేయడంలో ఎంఎస్‌ ధోనీ కీలక పాత్ర పోషించడం ఖాయం. ఆటగాడిగా ఈ సీజనే చివరిదిగా భావిస్తున్న క్రమంలో జడేజాకు అన్ని విధాలుగా తర్ఫీదు ఇచ్చి మరీ ఆటను వదిలేస్తాడని తెలుస్తోంది. వయసు రీత్యా రవీంద్ర జడేజా కనీసం ఇంకో ఆరేళ్లపాటు క్రికెట్‌ ఆటగలిగే ఫిట్‌నెస్‌ అతడి సొంతం. అందుకే జడేజాకు తోడుగా మరో యువ క్రికెటర్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం లేకపోలేదు. ఎంఎస్ ధోనీ మెంటార్‌గా ఉంటూ జట్టును వెనుకుండి నడిపిస్తాడనేది అభిమానుల అంచనా. అనుభవం ప్రకారం చూసుకుంటే రవీంద్ర జడేజా ఇంతవరకు కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిందే లేదు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనుభవం మాత్రమే జడేజా సొంతం. ఆ వరల్డ్‌కప్‌లో భారత్‌కు కప్‌ అందించిన విరాట్ కోహ్లీ కూడానూ ధోనీ తర్వాత టీమ్‌ఇండియాకు సారథి అయ్యాడు. అప్పటి వైస్‌ కెప్టెన్‌ జడేజాను అత్యంత ఛరిష్మా కలిగిన చెన్నైకు నాయకుడిగా ఎంపిక చేశాడు. 

టీమ్‌ఇండియా తరఫున జడేజాతోనే చివరి భాగస్వామ్యం

న్యూజిలాండ్‌తో 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్‌. అయితే ఇక్కడొక విశేషం ఉంది.. తన కెప్టెన్సీలోనే అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజాతోనే చివరి భాగస్వామ్యం నిర్మించడం విశేషం. ఆ మ్యాచ్‌లో ఓడిపోయి కప్‌ ఆశలు గల్లంతైనా సరే ధోనీ-జడేజా పోరాటం మాత్రం మరిచిపోలేం. కివీస్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. ఐదు పరుగులకే టాప్‌ఆర్డర్ పెవిలియన్‌కు చేరింది. కేఎల్ రాహుల్‌ (1), రోహిత్ (1), విరాట్ (1), కార్తిక్ (6) ఘోరంగా విఫలమయ్యారు. రిషభ్‌ (32), పాండ్య (32) కాస్త ఫర్వాలేదనిపించడంతో కుదురుకున్నట్లు కనిపించింది. అయితే స్వల్ప వ్యవధిలో వారిద్దరూ ఔట్‌ కావడంతో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రవీంద్ర జడేజా (77), ధోనీ (50) కలిసి 116 పరుగులను జోడించి విజయంపై ఆశలు కల్పించారు. అయితే మరోసారి కివీస్‌ ఆటగాళ్లు రాణించడంతో కీలక సమయంలో జడేజా, ధోనీ వరుసగా ఔటయ్యారు. చివరికి 221 పరుగులు చేసిన భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలై మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

-ఇంటర్నెట్ డెస్క్‌, ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని