రోహిత్‌ బ్యాటింగ్‌.. పంత్‌ దూకుడు.. పుజారా రన్స్‌

వచ్చే వారం న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌ శర్మ.. ట్రెంట్‌ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Updated : 12 Jun 2021 15:54 IST

WTC Final: టీమ్‌ఇండియాపై సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే వారం న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌ శర్మ.. ట్రెంట్‌ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన డాషింగ్‌ ఓపెనర్‌ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. బౌల్ట్‌, రోహిత్‌ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని, అందుకోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. వీరూ ఇంకా ఏం చెప్పాడో అతడి మాటల్లోనే..


రోహిత్‌ ఆట కోసం ఎదురుచూస్తున్నా..

‘ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ భారత జట్టుకు సవాళ్లు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లిద్దరూ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తారు. దాంతో రోహిత్‌.. బౌల్ట్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా ఉంటుంది. అందుకోసం నేను ఎదురుచూస్తున్నా. రోహిత్‌ అద్భుతమైన ఆటగాడు. 2014లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడాడు. దాంతో ఈసారి కూడా అక్కడ రాణిస్తాడనే నమ్మకముంది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గానూ అతడు బాగా ఆడుతున్నాడు. కానీ, ఇతర ఓపెనర్ల లాగే తొలి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి ఎలా వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ముందే గ్రహించాలి. ఇక తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడుతూ పరుగులు చేస్తాడని కచ్చితంగా చెబుతాను’ అని వీరూ పేర్కొన్నాడు.


పంత్‌ ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు..

‘పంత్‌ బ్యాటింగ్‌ గురించి అతడికే స్పష్టమైన అవగాహన ఉంది. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాలను పట్టించుకోకుండా తన ఆట మీదే దృష్టిసారించాలి. బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఒక్కొక్క బంతి గురించే ఆలోచించాలి. ఒక బంతిని షాట్‌ ఆడాలనిపిస్తే ధైర్యంగా ఆడాలి. తన బ్యాటింగ్‌ శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంతో జట్టులో తన స్థానమేంటో అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ఆరో స్థానంలో బరిలోకి వచ్చి త్వరగా పరుగులు చేస్తుంటే ఒకే సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు’ అని వివరించాడు.


పుజారా స్ట్రైక్‌రేట్‌తో అభ్యంతరం లేదు..

‘టెస్టు క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్‌ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను టీమ్‌ఇండియాకు ఆడే రోజుల్లో నా వెనకాల రాహుల్‌ ద్రవిడ్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ చేసేవాళ్లు. వాళ్లంతా ఈ ఫార్మాట్‌లో 50 స్ట్రైక్‌రేట్‌తోనే కొనసాగారు. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే క్రీజులో పాతుకుపోవడం. అందుకోసం పరుగులు చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించాలి. కాబట్టి.. పుజారా విషయంలో జట్టుకు పరుగులు చేస్తున్నంత కాలం నేను సంతోషంగానే ఉంటా. అక్కడ స్ట్రైక్‌రేట్‌ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు’ అని మాజీ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు.


అశ్విన్‌, జడేజా తుది జట్టులో ఉండాలి..

చివరగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ యూనిట్‌పై మాట్లాడుతూ..‘జూన్‌ 18న పిచ్‌ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అయితే, నేనెప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతా. పూర్తి బలమైన జట్టుతో ఆడాలి. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అందులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటే నాలుగు, ఐదు రోజుల్లో జట్టుకు కలిసివస్తుంది. ఈ విషయంలో అశ్విన్‌, జడేజా సరైన ఆటగాళ్లు. వాళ్లు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపుతారు. అప్పుడు ఆరో బ్యాట్స్‌మెన్‌ కూడా అవసరముండదు’ అని వీరూ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని