IPL 2021: తెలివిగా ఆడాం.. భారత క్రికెటర్లను పక్కనబెట్టడం ఇబ్బందే: కేఎల్‌ రాహుల్

కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో తాము తెలివిగా ఆడామని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. శుక్రవారం రాత్రి దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌...

Published : 02 Oct 2021 08:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో తాము తెలివిగా ఆడామని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. శుక్రవారం రాత్రి దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ.. ఈ రెండు పాయింట్లు తమకెంతో ముఖ్యమని, ఈ మ్యాచ్‌లో చాలా తెలివిగా ఆడామని చెప్పాడు. ఇదొక మంచి వికెట్‌ అని తెలిశాక ప్రయోగాలు చేయదల్చుకోలేదన్నాడు.

‘తొలుత బౌలింగ్‌లో కాస్త రక్షణాత్మక ధోరణి ప్రదర్శించాం. బంతి పెద్దగా స్పిన్‌ కాలేదు. బ్యాటింగ్‌ పరంగా ప్రతి ఒక్కరికీ స్పష్టమైన ఆదేశాలిచ్చాం. బ్యాటర్లు భారీ షాట్లు ఆడాలని కోరాం. ఎలాగైనా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఉన్నాం. ఈ విజయం మాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై ఇలాగే కొనసాగుతామని ఆశిస్తున్నా. భారత క్రికెటర్లను పక్కనపెట్టడం ఒక కెప్టెన్‌గా నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా, మనసు పెద్దది చేసుకొని హర్‌ప్రీత్‌ను పక్కనపెట్టాం. మరోవైపు క్రిస్‌గేల్‌ కూడా జట్టును వీడాడు. దీంతో సరైన ఆటగాళ్లు ఎవరనేది చూడాలి. అలాగే షారుఖ్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు మ్యాచ్‌లు పూర్తి చేయగలడని తెలుసు. ఇంతకుముందు కూడా తమిళనాడుకు ఆ పని చేసిపెట్టాడు. అయితే, కొన్నిసార్లు మేమే ఒత్తిడికి లోనయ్యాం. మాది ఎంత మంచి జట్టో అందరికీ తెలిసిందే. మాకు మేమే ఒత్తిడికి గురవ్వడం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆదేశాలున్నాయి. దీంతో చివరి వరకూ పోరాడటమే మా పనిగా పెట్టుకున్నాం’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

అవే మా కొంప ముంచాయి: మోర్గాన్‌

అనంతరం కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ.. ‘మొదట మేం అంత బాగా ఫీల్డింగ్‌ చేయలేదు. నాతో పాటు ఇతరులు క్యాచ్‌లు వదిలేశారు. మేం వెనుకబడటానికి అవే కారణం. చివర్లో మ్యాచ్‌ అంత రసవత్తరంగా మారినప్పుడు, రెండు, మూడు వికెట్లు పడితే వాళ్లపై ఒత్తిడి పెరిగి మాకు ఉపయోగపడేది. మరోవైపు గెలవడానికి మేం కూడా తీవ్రంగా శ్రమించాం. మా బ్యాటింగ్ బాగుంది. ఈ పిచ్‌పై మోస్తరు స్కోర్‌ చేసినా అది గెలవడానికి సరిపోదు. అయినా బౌలర్లు మంచి పని చేశారు. పంజాబ్‌ మాకన్నా బాగా ఆడింది. 19వ ఓవర్‌లో రాహుల్‌ ఔటయ్యాడనుకున్నా.. కానీ మనం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని గౌరవించాలి. ఒకవేళ ఆ వికెట్‌ దక్కింటే మాకు బాగుండేది. మా జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు దొరికిన అమూల్యమైన ఆటగాడు. ఏ మాత్రం భయపడకుండా తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. మాకింకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లో విజయం సాధించి ముందుకు సాగుతామనే నమ్మకం ఉంది’ అని కోల్‌కతా కెప్టెన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని