వాళ్లు రైతు రాబందులు

కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదని.. నాటి నుంచి తెలంగాణ దుస్థితికి కారణం ఆ పార్టీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. ఒకప్పుడు సుభిక్షంగా, గొప్పగా ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలలో కలిపారని పేర్కొన్నారు. తెలంగాణ గోసకు కాంగ్రెసే కారణమని ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన హాలియాలో జరిగిన రైతాంగ ధన్యవాద సభలో మాట్లాడారు.

Published : 11 Feb 2021 02:47 IST

కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌
తెలంగాణ గోసకు వారే కారణం
అభివృద్ధి చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌, భాజపా విమర్శలు
12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే ఓట్లు అడగం
బడ్జెట్‌లో దళిత సాధికారతకు రూ. 1000 కోట్లు
‘హాలియా ధన్యవాద సభ’లో ముఖ్యమంత్రి

ఈనాడు నల్గొండ: కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదని.. నాటి నుంచి తెలంగాణ దుస్థితికి కారణం ఆ పార్టీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. ఒకప్పుడు సుభిక్షంగా, గొప్పగా ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలలో కలిపారని పేర్కొన్నారు. తెలంగాణ గోసకు కాంగ్రెసే కారణమని ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన హాలియాలో జరిగిన రైతాంగ ధన్యవాద సభలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మఠంపల్లి, చింతలపల్లి మండలాల గిరిజనులకు రెండు మూడ్రోజుల్లో పట్టాలిస్తామని ప్రకటించారు. ‘కొంతమంది కాంగ్రెస్‌ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు భాజపా వాళ్లు ప్రవర్తిస్తున్నారు. మీలా మాట్లాడటం మాకు చేతకాక కాదు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌, భాజపా విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలకు ఇవ్వడం చేతకాలేదు. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నరు. వాళ్లు రైతు రాబందులు..’ అని సీఎం వ్యాఖ్యానించారు.

కమీషన్ల కోసమే సాగర్‌ను కట్టారా?
‘‘పదవులు, పైరవీల కోసం కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను బలి పెట్టారు. నాగార్జునసాగర్‌ ఇంకో 19 కి.మీ. ఎగువన కట్టాలే. కాని దుర్మార్గుడు కేఎల్‌రావు తెలంగాణ నీటి వాటాను తగ్గించి వారి ప్రాంతానికి నీళ్లను తీసుకుపోయిండు. ఏలేశ్వరం వద్ద సాగర్‌ను కడితే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకాల అవసరమే ఉండకుండే. ఆంధ్రకు అనుకూలంగా ప్రాజెక్టులు కడితే మూగనోము వహించింది ఈ కాంగ్రెస్‌ నేతలు కాదా? ప్రజలకు వారు సమాధానం చెప్పాలి. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నిండు సభలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా నిలదీయలేదు. ఇప్పుడు పొలంబాట, పోరుబాట అంటూ సీఎల్పీ నేత బయల్దేరారు. ప్రాజెక్టులను కడితే కమీషన్ల కోసమే కడుతున్నారు అంటున్నారు. అప్పట్లో మీరు నాగార్జునసాగర్‌ను కమీషన్ల కోసమే కట్టారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉంటే కుదరదు. ఫ్లోరైడ్‌ సమస్య నల్గొండ జిల్లాలోని ఒక తరాన్ని నాశనం చేసింది. లక్షన్నరమంది జీవితాలు నాశనం అయ్యాయి. మేం ఫ్లోరైడ్‌ను నూరు శాతం తరిమేశాం. రెండు పంటలకు నీళ్లిస్తున్నాం. అవినీతిరహితంగా పాలిస్తున్నాం.
చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఎవరూ మాట్లాడలేదు. నాడు కరెంటు లేదు. ఎరువుల్లేవు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదు. దేశంలో అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమే. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. మరో నాలుగైదు నెలల్లో మరో 25 లక్షల ఎకరాల్లో సాగు అందుబాటులోకి వస్తుంది.

పథకాలు పూర్తిచేయకపోతే ఓట్లు అడగం
నల్గొండ అనాదిగా చాలా నష్టపోయిన జిల్లా. ఏ నాయకుడూ, ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. గతంలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరిగినప్పటి నుంచి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిరంతరం ఇక్కడి సమస్యలను నా దృష్టికి తెస్తున్నారు. రూ. 2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేశాం. ఏడాదిన్నరలోపు వీటిని పూర్తి చేసి నీరందిస్తాం. సాగర్‌ ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటాం. ఏడాదిన్నరలోపు ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. తెరాస వీరుల పార్టీ. వీపు చూపించే పార్టీ కాదు.

గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం
కృష్ణాలో నీటి లభ్యత తక్కువ. దేవుడు కనికరం వల్ల గత రెండేళ్ల నుంచి నది మంచిగా పారుతోంది. ఒకవేళ ఇక్కడ నీరు లేకపోయినా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుతో పాలేరు వాగు నుంచి పెద్దదేవులపల్లి చెరువుకు నీటిని తీసుకొచ్చి సాగర్‌ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. దీనికి రూ. 600 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమయింది. త్వరలో అనుమతులు ఇస్తాం. అవసరమైతే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరాను కూడా ఎండనివ్వం. గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం.

ఉమ్మడి నల్గొండ సస్యశ్యామలం
డిండి ఎత్తిపోతలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. బ్రాహ్మణవెల్లంల, ఎస్‌ఎల్‌బీసీలకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి పూర్తి చేస్తాం. బస్వాపూర్‌ జలాశయాన్ని పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌లో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లిస్తాం. గాలి మాటలకు మోసపోవద్దు. మంచి పార్టీని, మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలే. అలా కాదంటే మన చేతులే కాలుతాయి. మోసపోకుండా, ఆగం కాకుండా నాకు అండగా ఉండండి. మీ సంక్షేమ బాధ్యతను నేను తీసుకుంటా’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

12 ఎత్తిపోతలకు శంకుస్థాపనలు
హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ చేరుకున్న ముఖ్యమంత్రికి శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం నెల్లికల్‌ వద్ద కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో నెల్లికల్‌, పెద్దవూర మండలంలోని పుల్యా తండా వద్ద లోలెవల్‌ కెనాల్‌ టు హైలెవల్‌ కెనాల్‌, బాల్నేపల్లి - చాప్లా అడవిదేవులపల్లి, బొత్తలపాలెం - వాడపల్లి, కేశవాపురం - కొండ్రపోల్‌, జాన్‌పహడ్‌ కెనాల్‌ లైనింగ్‌, ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌, ఏకేబీఆర్‌ అంగడిపేట, పీఏ పల్లి మండలంలోని పెద్దగట్టు, అంబ భవాని, కంబాలపల్లి, పొగిళ్ల ఎత్తిపోతలున్నాయి.

నల్గొండ జిల్లాకు వరాలు

నల్గొండ జిల్లాలోని 844 పంచాయతీలకు ఒక్కొక్క దానికి రూ. 20 లక్షల చొప్పున, ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి ద్వారా విడుదల చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలోని 8 మున్సిపాల్టీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. నల్గొండ పురపాలికకు రూ. 10 కోట్లు, మిర్యాలగూడకు రూ. 5 కోట్లు, మరో ఆరు పురపాలికలకు రూ. కోటి చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని యాదవులు, గొల్ల కుర్మలు, మత్స్యకారుల అభివృద్ధికి నిధులు కేటాయించి వారి సంక్షేమానికి బాటలు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని దళితుల జీవన స్థితిగతులు మరింతగా మెరుగుపడాలని.. అందుకు వచ్చే బడ్జెట్‌లో ముఖ్యమంత్రి దళిత సాధికారతకు   రూ. 1000 కోట్లు కేటాయిస్తామన్నారు.

త్వరలో పింఛన్లు, రేషన్‌కార్డులు

తెరాస చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘‘కల్యాణలక్ష్మి ఎక్కడైనా అమలవుతుందా? గతంలో రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ ఆఫీసుల్లోకి పోతే లంచాలివ్వాలి. ఇప్పుడు ధరణితో దానికి అడ్డుకట్ట వేశాం. ‘ధరణి’ ద్వారా ఇప్పటికే చాలావరకు భూ సమస్యలను పరిష్కరించాం. అవసరమైతే కొత్త చట్టాన్ని తెచ్చి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. త్వరలోనే జిల్లాలవారీగా పర్యటనలు జరిపి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా. రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు, రేషన్‌కార్డులను జారీ చేస్తాం. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మన మధ్య లేకపోవడం బాధాకరం’’ అని అన్నారు.

నేను చెప్పింది అబద్ధమైతే ఓడించండి

కాంగ్రెస్‌ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న వారు లేరని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘ముక్త్యా బ్రాంచ్‌ కెనాల్‌ను 50 ఏండ్లలో ఎందుకు లైనింగ్‌ చేయలేదు? దిల్లీలో నామినేట్‌ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదిది. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకుంటాం. మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పాం. నల్గొండ ప్రజలు వాస్తవాలు గమనించి న్యాయమైన తీర్పునివ్వాలి. తెలంగాణను కరవు పాల్జేసిందెవరూ? రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిందెవరూ? గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పింది అబద్ధమైతే సాగర్‌ ఉప ఎన్నికల్లో తెరాసను ఓడించండి. నిజమని నమ్మితే ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్‌ దక్కకుండా చేయండి’’ అని కోరారు.

హద్దు మీరితే తొక్కి పడేస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో మాట్లాడుతుండగా ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నిరసన తెలిపారు. వారిని బయటకు పంపాలని సీఎం పోలీసులకు సూచించారు. ‘‘వేరే పార్టీల సభకు వచ్చి వీరంగం చేస్తామంటే ఎవరూ హర్షించరు. పిచ్చి పనులు బంద్‌ చేయాలి. ఆ పార్టీల నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. సహనానికి, పిచ్చివాగుడుకు హద్దుంటుంది. హద్దు మీరితే తొక్కి పడేస్తాం. చాలామంది రాకాసులతోనే కొట్లాడాం. వీళ్లొక లెక్కగాదు. సభలు పెట్టుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వారు కూడా సభ పెట్టుకొని ప్రజలకు వివరించాలి’’ అని సీఎం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని