సమతామూర్తి సాకారమైంది ఇలా..

శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్‌మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్‌స్వామి...

Updated : 05 Feb 2022 10:00 IST

విగ్రహ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు
చిన్నజీయర్‌స్వామి దీక్ష, పట్టుదలకు నిదర్శనం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్‌మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్‌స్వామి అకుంఠిత దీక్ష, పట్టుదల, శ్రమ.. విగ్రహం నిర్మాణంలో అడుగడుగునా కనిపిస్తాయి.

ఆరంభం ఇలా..
2013లో మొదలైన ఆలోచనల అనంతరం 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. దానికి బెంగళూరులో 3డీ స్కానింగ్‌ చేయించారు. దాంతో ఆబ్జెక్టు ఫైల్‌ తయారు చేయించారు. దాన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్‌ తీసుకుని మాయ, మడ్‌బ్రష్‌ సాఫ్ట్‌వేర్లు వినియోగించి మరింత సుందరంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి సూక్ష్మ అంశాలు కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో దాదాపు 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్‌స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ తయారు చేయించారు.

చైనాలో 1600 భాగాలుగా తయారీ
సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి, క్యాస్టింగ్‌, అసెంబ్లింగ్‌ పనులు అప్పగించారు. ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్‌ పరిజ్ఞానం వినియోగించి థర్మోకోల్‌తో 1:10 మోడల్‌ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేయించారు. చినజీయర్‌స్వామి చైనా వెళ్లి దాన్ని పరిశీలించి సవరణలు చెప్పారు. తర్వాత మరిన్ని సవరణలతో మరో సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనా పంపించారు. మరోసారి థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్‌కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్‌లో తయారైన స్టీల్‌ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. మొత్తం ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది.

అయిదు లోహాలు ఇవీ...
విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్‌, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని