Lockdown విధింపును పరిశీలించండి

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం .....

Updated : 03 May 2021 08:27 IST

oxygen అదనపు నిల్వలను పెంచండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన

ఈనాడు, దిల్లీ: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్‌ మిగులు నిల్వలు (బఫర్‌స్టాక్‌) ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది.  ‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ విధించే అవకాశాన్ని పరిశీలించండి. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసు. అందువల్ల లాక్‌డౌన్‌ విధించేట్లయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి’’ అని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. వివిధ అంశాలపై సమాచారాన్ని కోరింది. సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.
* సామూహిక సమావేశాలు, సభలు, వైరస్‌ని సూపర్‌స్ప్రెడర్‌గా వ్యాపింపజేసే కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలి.
* రూ.50 లక్షల కరోనా బీమా వర్తించిన 22 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటి వరకు మరణించిన వారికి సంబంధించిన 287 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంకా ఎన్ని క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని ఎంత కాలంలో పరిష్కరిస్తారు?
* కొవిడ్‌ సోకిన వైద్య ఆరోగ్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్‌, అత్యవసర మందులు దొరకడం లేదని తెలిసింది. మరికొందరిని పాజిటివ్‌గా తేలిన పది రోజుల్లోపే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యుల సేవలను గుర్తించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
* ఆరోగ్యానికి ముప్పు కలగకుండా విధులు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిందీ తెలియలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిష్కరించాలి.
* వైద్య సిబ్బందికి అవసరమైన ఆహారం, పని విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, రవాణా సౌకర్యం అందించడం, కొవిడ్‌కు గురైనప్పుడు జీతాలు, సెలవుల్లో కోతలు విధించరాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక సమయం విధులు నిర్వహించిన వారికి ఓవర్‌టైం అలవెన్స్‌ ఇవ్వాలి.
* మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి.
* ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా అర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ విషయం అధికార యంత్రాంగానికంతటికీ తెలిసేలా ప్రతి జిల్లా కలెక్టర్‌కు పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
* దిల్లీ ఆక్సిజన్‌ సమస్యను మే 3వ తేదీ అర్ధరాత్రిలోపు పరిష్కరించండి.
* ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లోపు ఒక జాతీయ విధానాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి విధానం ఖరారు చేసేంత వరకూ స్థానిక చిరునామా లేదనో, గుర్తింపుకార్డు లేదనే కారణంతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించడానికి కానీ, అత్యవసర మందులు తిరస్కరించడానికికానీ వీల్లేదు.
* కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన కార్యాచరణను, ప్రొటోకాల్స్‌ను పునఃసమీక్షించాలి. ఆక్సిజన్‌ లభ్యత, వ్యాక్సిన్ల అందుబాటు, వాటి ధరలు, అందుబాటు ధరల్లో అత్యవసర మందుల లభ్యతతో పాటు, ఈ ఆర్డర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపైనా కేసు తదుపరి విచారణ జరిగే 10వ తేదీ లోపు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన అఫిడవిట్లు అన్నింటినీ అమికస్‌క్యూరీకి ముందుగా అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని