నియామకాలు చేపడతారా? చర్యలు తీసుకోమంటారా?

దేశంలో వివిధ ట్రైబ్యునళ్లలోని ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తాత్సార వైఖరిపట్ల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన

Updated : 07 Sep 2021 12:48 IST

ఖాళీలు నింపకుండా నిర్వీర్యం చేస్తున్నారు

నిబంధనలకు విరుద్ధంగా కొత్త చట్టం ఎలా తెస్తారు?

ట్రైబ్యునళ్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

తీర్పులపై కేంద్రానికి గౌరవం లేదని వ్యాఖ్య

ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం

ఈ కోర్టు తీర్పులను గౌరవించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైబ్యునళ్ల విషయంలో మీరెందుకు ఇలా ఉన్నారన్నది అర్థం కావడంలేదు.  వాటిని వద్దనుకుంటున్నారా? తీర్పును గౌరవించకపోతే ఎలా?

ట్రైబ్యునళ్లపై విచారణ సందర్భంగా కేంద్ర వైఖరిని తూర్పారబడుతూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఉద్దేశించి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలివి.

ఈనాడు, దిల్లీ: దేశంలో వివిధ ట్రైబ్యునళ్లలోని ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తాత్సార వైఖరిపట్ల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ‘ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం- 2021’ని తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ఈ అంశంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం, లేదంటే ట్రైబ్యునళ్లను మూసేయడం తప్ప మరో గత్యంతరం లేకుండా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని వ్యాఖ్యానించింది. ట్రైబ్యునళ్ల తరలింపు, సభ్యుల నియామకం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చేసిన కొత్త ట్రైబ్యునల్‌ సంస్కరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ బార్‌ అసోసియేషన్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెండు వారాల్లో చర్యలు : కేంద్రం

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘‘కేంద్రం కొత్తగా చేసిన 2021 ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం.. ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేసింది. ఎంపిక సంఘం సిఫార్సు చేసిన చోట్ల కార్యాచరణ మొదలైంది. నియామకాలపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే రెండు వారాల్లో కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది’’ అని చెప్పారు. మొదటి నుంచీ ఈ కేసును అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ చూస్తున్నారని, వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున కేసును వాయిదా వేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అందుకు నిరాకరించారు. ‘‘ఇదివరకు మేం వాదనలను సుదీర్ఘంగా విని ఉత్తర్వులు జారీచేశాం. కానీ అమలు చేయలేదు. ఈ కోర్టు వెలువరించే తీర్పులపై మీకు గౌరవం లేదు. కోర్టుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. కొంతమందిని నియమించినట్లు క్రితంసారి మీరు తెలిపారు. ఎంతమందిని నియమించారో చెప్పండి’’ అని సొలిసిటర్‌ జనరల్‌ను జస్టిస్‌ రమణ ప్రశ్నించారు.

కొన్ని మూతపడే దిశలో ఉన్నాయి

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ‘‘ఇదివరకు ఉన్న చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీ కోసం ఏడాదిన్నర క్రితమే సిఫార్సులు చేశాం. అందుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అయినప్పటికీ ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ప్రస్తుతం కొన్ని ట్రైబ్యునళ్లు మూతపడే దిశలో ఉన్నాయి. మరికొన్ని ఒకే సభ్యుడితో నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేస్తామని చెబుతోంది. కానీ ఇదివరకున్న చట్టం ప్రకారం సిఫార్సులు చేశాం’’ అని గుర్తుచేశారు. కంపెనీ లా ట్రైబ్యునల్‌, వినియోగదారుల పరిష్కార కమిషన్‌లోని ఖాళీల పట్ల జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సమర్థించారు. ‘‘ట్రైబ్యునళ్లు పనిచేయకపోవడంవల్ల ఆ భారం అంతా కోర్టుల మీద పడుతోంది. నియామకాలు చేపట్టకుండా ట్రైబ్యునళ్లను మీరు నిర్వీర్యం చేస్తున్నారు’’ అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.

బ్యూరోక్రాట్ల సలహాలను అర్థం చేసుకోగలం!

‘‘తీర్పులు  బుట్టదాఖలు అయ్యేలా చట్టం చేయమని కొందరు బ్యూరోక్రాట్లు సలహా ఇచ్చి ఉండొచ్చు. కోర్టులు ఏదైనా తీర్పు చెబితే దాన్ని వ్యతిరేకిస్తూ చట్టం చేయమని చెబుతుంటారు. దాన్ని మేం అర్థం చేసుకోగలం. ఇది చాలా తీవ్రమైన అంశం. మేం చాలా కలతకు గురయ్యాం. స్పష్టమైన నిర్ణయం చెప్పడానికి మీకు రెండు మూడు రోజులు సమయం ఇస్తున్నాం. కేంద్రం చేసిన చట్టంపై కూడా ఆ రోజు ఉత్తర్వులు ఇస్తాం’’ అని ఎస్‌జీకి జస్టిస్‌ రమణ చెప్పారు. ‘‘కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాం. అప్పటికల్లా మేం నియామకాలను ఆశిస్తున్నాం. చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులోనూ నోటీసులు జారీ చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘సీజీఎస్‌టీ ట్రైబ్యునల్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. కావాలనుకుంటే మేం ఇప్పటివరకు కోర్టులో చెప్పిన విషయాలన్నింటినీ క్రోడీకరించి ఉత్తర్వులు ఇస్తాం. అవి వద్దనుకుంటే.. మాకు వచ్చే వాయిదాకల్లా నియామకాలు కావాలి. ఏది కావాలో మీరే తేల్చుకోండి’’ అని తుషార్‌ మెహతాకు సీజేఐ సూచించారు.

ఐటీ ట్రైబ్యునల్‌ అధ్యక్షునిగా జి.ఎస్‌.పన్ను

ట్రైబ్యునల్‌ ఖాళీల భర్తీలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ అధ్యక్ష బాధ్యతలను ఆ ట్రైబ్యునల్‌ ఉపాధ్యక్షుడు జి.ఎస్‌.పన్నుకు కట్టబెట్టింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు కానీ, పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించేంత వరకు కానీ ఈయనే ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది.

ప్రత్యామ్నాయాలు మూడే : సీజేఐ

‘‘ఈ కోర్టు తీర్పులను గౌరవించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మా ముందు మూడే ప్రత్యామ్నాయాలున్నాయి.
1. కొత్తగా మీరు చేసిన చట్టంపై స్టే ఇచ్చి, ఇదివరకున్న నిబంధనల ప్రకారం నియామకాలు కొనసాగించమని చెప్పడం.
2. ట్రైబ్యునళ్లు మూసేసి, వాటిముందున్న కేసులను హైకోర్టులకు అప్పగించడం.
3. నేరుగా మేమే నియామకాలు చేపట్టడం.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడమే ప్రస్తుత మార్గంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మీరు చూపిన వేగాన్ని మాతోపాటు ప్రతి ఒక్కరూ అభినందించారు. కానీ ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ఏంచేశారు?  వాస్తవంగా అన్నీ కుప్పకూలాయి. వీటి నియామకాల విషయంలో మీరెందుకు ఇలా ఉన్నారన్నది అర్థం కావడంలేదు. ట్రైబ్యునళ్లు వద్దనుకుంటున్నారా? తీర్పును గౌరవించకపోతే ఎలా?’’ అని తుషార్‌ మెహతాను జస్టిస్‌ రమణ సూటిగా ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని