రైలు.. వేగంగా.. భద్రంగా

దక్షిణ మధ్య రైల్వేకు ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు పెద్దసంఖ్యలో కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

Published : 02 Feb 2023 03:50 IST

ద.మ. రైల్వేకు గణనీయంగా రానున్న ఎల్‌హెచ్‌బీ బోగీలు

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేకు ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు పెద్దసంఖ్యలో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్‌లో రైల్వే శాఖకు భారీగా నిధులు పెంచిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతపై, రైళ్ల వేగంపై దృష్టి సారించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా రోలింగ్‌ స్టాక్‌గా వ్యవహరించే బోగీలు, వ్యాగన్లు, ఇంజిన్లకు నిధులను పెద్దఎత్తున పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6,978 ఆధునిక ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌), వందేభారత్‌ బోగీలను ఉత్పత్తి చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. కొత్త బోగీలను వేల సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు నిధులు కేటాయించిన నేపథ్యంలో జోన్‌కి గణనీయ సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయి. ద.మ.రైల్వేకు ఇక నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలే వస్తాయి. పాతకాలం వాటితో (గరిష్ఠ వేగం 110 కిమీ) పోలిస్తే, ఇవి వేగవంతమైనవి. ఈ రైళ్లలో ప్రయాణ భద్రత కూడా ఎక్కువే. ముఖ్యంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సంబంధించిన కోచ్‌లు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి కానున్నాయి. తద్వారా మరిన్ని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి పట్టాలు ఎక్కేందుకు మార్గం సుగమం కానుంది. రోలింగ్‌ స్టాక్‌కి గత బడ్జెట్‌లో రూ.7,997 కోట్లు కేటాయిస్తే ఈసారి ఆ మొత్తాన్ని ఏకంగా రూ.37,581 కోట్లకు పెంచారు. అంటే కొత్త రైళ్లు అదేవిధంగా పాత వాటి స్థానంలో నూతన రైళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అదనపు లైన్లకు అధిక నిధులు కేటాయించిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని డబ్లింగ్‌ (రెండో లైను), త్రిబ్లింగ్‌(మూడో లైను) నిర్మాణ పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. డబ్లింగ్‌, త్రిబ్లింగ్‌కు కిందటి బడ్జెట్‌లో భారతీయ రైల్వేకి రూ.12,108 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.30,709 కోట్లకు పెంచారు. ఈ లెక్కన చూస్తే ద.మ.రైల్వేకి ఇప్పుడు ఉన్న రూ.5,517 కోట్ల కేటాయింపులు రెట్టింపునకు మించే అవకాశం ఉంది. కాజీపేట-బల్లార్ష, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను పనులు జరుగుతున్నాయి. గుంటూరు-గుంతకల్లు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్‌ పనులు అవుతున్నాయి. తెలుగురాష్ట్రాల మధ్య బీబీనగర్‌-నల్లపాడు అదేవిధంగా మోటుమర్రి-విష్ణుపురం రెండో లైనుకు ఈ బడ్జెట్‌లో అయినా మోక్షం లభించిందా? అన్న విషయం స్పష్టం కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని