స్కౌట్‌ పథకానికి 15 మంది విద్యార్థినుల ఎంపిక

యూకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఔట్‌స్టాండింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ట్యాలెంట్‌(స్కౌట్‌) పథకం కింద రాష్ట్రానికి చెందిన 15 మంది డిగ్రీ విద్యార్థినులు ఎంపికయ్యారు.

Published : 05 Feb 2023 03:56 IST

గ్లాస్గో విశ్వవిద్యాలయంలో స్వల్పకాలిక కోర్సులో ప్రవేశం

నాంపల్లి, న్యూస్‌టుడే: యూకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఔట్‌స్టాండింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ట్యాలెంట్‌(స్కౌట్‌) పథకం కింద రాష్ట్రానికి చెందిన 15 మంది డిగ్రీ విద్యార్థినులు ఎంపికయ్యారు. వారు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలో రెండు వారాల సర్టిఫికెట్‌ కోర్సు చదవనున్నారు. హైదరాబాద్‌లోని రూసా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఈ వివరాలను వెల్లడించారు. హేతుబద్ధంగా ఉండటం ఎలా?, విమర్శనాత్మక ఆలోచన, తర్కం, హేతువాదన అనే అంశాల్లో మార్చి 26 నుంచి రెండు వారాలపాటు గ్లాస్గో యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులో ఈ విద్యార్థులు చేరి విద్యనభ్యసిస్తారన్నారు. ఈ కోర్సుకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల నుంచి నలుగురు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి అయిదుగురు, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నుంచి ఆరుగురు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు ఎంపికయ్యారని చెప్పారు. ఈ కోర్సువల్ల విదేశీ విద్యను అభ్యసించాలన్న కోరిక తీరడంతో పాటు పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. కోర్సు ఫీజులు, వసతికి అయ్యే ఖర్చులన్నీ బ్రిటిష్‌ కౌన్సిల్‌ భరిస్తుందన్నారు. విద్యార్థినులతో పాటు వారితోపాటు ఎంపికైన ఇద్దరు అధ్యాపకుల వీసా, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని నవీన్‌మిత్తల్‌ తెలిపారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో సీనియర్‌ అంతర్జాతీయ అధికారిణి డొన్నాగల్‌, బ్రిటిష్‌ కౌన్సిల్‌ దక్షిణ భారత డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని