తెలంగాణలో స్మార్ట్‌ నగరాలకు రూ. 692 కోట్ల వ్యయం

తెలంగాణలో స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన వరంగల్‌, కరీంనగర్‌ నగరాల కోసం ఇంతవరకు రూ.692 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

Published : 21 Mar 2023 04:52 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన వరంగల్‌, కరీంనగర్‌ నగరాల కోసం ఇంతవరకు రూ.692 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. రాజ్యసభలో సోమవారం భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ఈ రెండు నగరాలకు ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం రూ.441 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.326 కోట్లు కలిపి మొత్తం రూ.767 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.692 కోట్లు (90%) ఖర్చయినట్లు తెలిపారు. ఈ మిషన్‌ పూర్తికి తుది గడువును ఈ ఏడాది జూన్‌ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆలోపు తెలంగాణ సహా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని స్మార్ట్‌ నగరాల్లో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

సింగరేణికి విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు రూ.3,713 కోట్లు

సింగరేణి కాలరీస్‌కు విద్యుదుత్పత్తి సంస్థల నుంచి రూ.3,713.15 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈమేరకు సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2022 మార్చి 31 నాటికి రూ.5,755.5 కోట్ల మేర ఉన్న బకాయిలు 2023 ఫిబ్రవరి 28 నాటికి రూ.3,713.15 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. ఏడాది కాలంలో రూ.2,042.35 కోట్ల బకాయిలు వసూలైనట్లు వెల్లడించారు. బకాయిల కారణంగా బొగ్గు ఉత్పత్తి సంస్థల మూలధన వ్యయంపై ప్రభావం పడుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని