Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్‌కు గిఫ్ట్‌ పంపించిన ప్రధాని మోదీ

యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ను కలిశారు. ప్రధాని మోదీ తరఫున ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated : 13 Nov 2023 06:36 IST

లండన్‌: అధికారిక పర్యటన నిమిత్తం యూకే (UK)కు వెళ్లిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (Jaishankar) ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (rishi sunak)ను కలిశారు. తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ (PM Modi) తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహం, భారత్‌స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది. మరోవైపు తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ జైశంకర్‌ కూడా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. యూకేలో జైశంకర్‌ పర్యటన నవంబర్‌ 15 వరకు కొనసాగనుంది. ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో ఆయన సమావేశమై భారత్‌-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని