సంక్షిప్త వార్తలు(3)

అమెరికాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ).. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్‌-1బి అనే గ్రహంపై ఉష్ణోగ్రతను కొలిచింది.

Updated : 29 Mar 2023 06:16 IST

సుదూర గ్రహంలో 225 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత
గుర్తించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు

దిల్లీ: అమెరికాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ).. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్‌-1బి అనే గ్రహంపై ఉష్ణోగ్రతను కొలిచింది. 225 డిగ్రీల సెల్సియస్‌ వేడితో అది నిప్పుల కొలిమిలా ఉంటుందని తేల్చింది. ఆ గ్రహం నుంచి వెలువడే థర్మల్‌ ఉద్గారాలను విశ్లేషించిన టెలిస్కోపులోని మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ పరికరం.. ఈ మేరకు తేల్చింది. ఈ సాధనానికి సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాల ఉష్ణోగ్రతలు, భూ పరిమాణంలో ఉన్న గ్రహాలను వర్గీకరించే సామర్థ్యం ఉంది. జీవుల మనుగడకు అవసరమైన స్థాయిలో అక్కడ వాతావరణం ఉందా అన్నది కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ట్రాపిస్ట్‌-1 వ్యవస్థలో మొదటి గ్రహం 1బి. మాతృతారకు చాలా దగ్గరగా ఉండటం వల్ల అది ఎక్కువ వేడిని పొందుతోంది.


కెనడాలో మళ్లీ గాంధీ విగ్రహం ధ్వంసం

టొరంటో: కెనడాలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ సైమన్‌ ఫ్రేజర్‌ విశ్వవిద్యాలయం ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనను వాంకోవర్‌లో ఉన్న భారత కాన్సులేట్‌ జనరల్‌ ఖండించారు. దీనిపై అధికార యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. హామిల్టన్‌ సిటీహాల్‌లో ఇదే నెల 23న గాంధీ విగ్రహం రూపురేఖలను ఖలిస్థాన్‌ మద్దతుదారులు మార్చేసిన విషయం తెలిసిందే. గతేడాది జులైలో రిచ్‌మండ్‌ హిల్‌ సమీపంలోని విష్ణువు ఆలయం వద్దనున్న గాంధీజీ విగ్రహాన్నీ ధ్వంసం చేశారు.


ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరుల అరెస్టు

సింగపూర్‌: ఇంటర్‌పోల్‌ రెడ్‌ లిస్ట్‌లో ఉన్న ముగ్గురు అనుమానిత ఖలిస్థానీ సానుభూతిపరులను ఫిలిప్పీన్స్‌లో ఆ దేశ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. మన్‌ప్రీత్‌ సింగ్‌(23), అమృత్‌పాల్‌ సింగ్‌(24), అర్ష్‌దీప్‌ సింగ్‌(26) అనే ఈ ముగ్గురూ నిషేధిత సిక్కు తీవ్రవాద సంస్థలో సభ్యులని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (సీఐసీసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ రామోస్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్చి 7న ఇలాయిలో నగరంలో వీరుంటున్న అపార్ట్‌మెంటుపై సాయుధ దళాలు మెరుపుదాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌, అతడి అనుచరులపై పంజాబ్‌ పోలీసులు ఉక్కు పాదం మోపిన సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని