భారత్‌ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు

భారత్‌ సరిహద్దుల సమీపంలోని ఆక్రమిత అక్సాయ్‌చిన్‌లో చైనా సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతోందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ చాటమ్‌హౌస్‌ (రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌) పేర్కొంది.

Published : 06 Jun 2023 04:55 IST

సైనిక మోహరింపులకు వీలుగా ఏర్పాట్లు
బ్రిటన్‌ సంస్థ నివేదిక

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సరిహద్దుల సమీపంలోని ఆక్రమిత అక్సాయ్‌చిన్‌లో చైనా సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతోందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ చాటమ్‌హౌస్‌ (రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌) పేర్కొంది. సైనికుల మోహరింపునకు వీలుగా ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. రోడ్ల విస్తరణ, అవుట్‌పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. అక్టోబరు 2022 నుంచి ఆరు నెలలపాటు ఉపగ్రహ చిత్రాలు, 2020లో ఘర్షణ తర్వాత భారీ నిర్మాణాలకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది.అక్సాయ్‌చిన్‌లో శాటిలైట్‌ చిత్రాల్లో.. విస్తరించిన రోడ్లు, అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే అత్యాధునిక శిబిరాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, సౌర ఫలకాలు, హెలిప్యాడ్‌లు ఉన్నట్లు చాటమ్‌హౌస్‌ తన నివేదికలో వెల్లడించింది. వివాదాస్పద ప్రదేశంలో సరికొత్త హెలిపోర్టు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో డ్రోన్లు, హెలికాప్టర్లు మోహరించడానికి వీలుగా 18 హ్యాంగర్లు, చిన్నపాటి రన్‌వేను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా అక్సాయ్‌చిన్‌ చుట్టుపక్కల చైనా సైన్యం ఉద్ధృతంగా కార్యకలాపాలు సాగించేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. 

2020లో సైనిక ఘర్షణ తర్వాత భారత్‌-చైనా సంబంధాలు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి క్షీణించాయి. దీంతోపాటు గల్వాన్‌ లోయ సమీపంలోని చైనా సైనిక స్థావరాలను రోడ్లతో అనుసంధానం చేశారు. దీంతో ఇక్కడి నుంచి గడ్డకట్టిన నది మీదుగా గతంలో ఘర్షణ జరిగిన ప్రదేశాన్ని వీక్షించే పరిస్థితి నెలకొన్నట్లు చాటమ్‌హౌస్‌ నివేదికలో వెల్లడించింది. మరోవైపు దెప్సాంగ్‌ మైదానాలు వంటి చోట్ల కూడా చైనా దళాల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఒక దెప్సాంగ్‌కు దక్షిణంపైపు ఉన్న ‘రకి నాలా’ వద్ద భారత దళాల గస్తీని అడ్డుకొనే స్థితిలో చైనా సైన్యం ఉన్నట్లు వెల్లడించింది. దీంతోపాటు పలు అంశాలను విశ్లేషించింది. ఆక్సాయ్‌చిన్‌ భారత భూభాగం. చైనా దీన్ని ఆక్రమించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని