NASA: ముగింపు దశకు జాబిల్లి యాత్ర..!

నాసా జాబిల్లి యాత్ర ముగింపు దశకు చేరుకొంది. ఒరియన్‌ క్యాప్సుల్‌ తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.

Published : 02 Dec 2022 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాసా ప్రయోగించిన ఆర్టెమిస్‌-1లోని ఒరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమిపైకి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. దీనిని ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా నవంబర్‌ 16న ప్రయోగించారు. నవంబర్‌ 25న చంద్రుడి వైపు సుదూర ప్రాంతానికి ఇది చేరుకొంది. తాజాగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన ఒరియన్‌ డిసెంబర్‌ 11వ తేదీన భూమిపై సముద్రంలో పడుతుంది. ఈ ప్రయోగంలో ముఖ్యంగా  ఒరియన్‌ ఉష్ణ కవచాల మన్నికను పరీక్షించనున్నారు. ఇది గంటకు దాదాపు 39,400 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. స్పేస్‌ స్టేషన్‌ నుంచి వ్యోమగాములు భూమిపైకి వచ్చే వేగం కన్నా ఇది చాలా అధికం. ఇది భూమి పైకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టే ముందు 10 చిన్న ఉపగ్రహాలను విడుదల చేయనుంది. ఇవి చంద్రుడి దక్షిణ ద్రువంపై మంచును గుర్తించడం వంటి పనులు చేయనున్నాయి. భవిష్యత్తులో జరిగే ఆర్టెమిస్‌ ప్రాజెక్టుల్లో మనుషులు అక్కడే ల్యాండ్‌ అవ్వనున్నారు. 

ఈ ప్రయోగం విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్‌-2 యాత్రను నాసా నిర్వహిస్తుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే కానుంది. 2025లో ఆర్టెమిస్‌-3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనున్నారు. ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని ‘డిపో’ నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది. తర్వాతి దశలో ‘గేట్‌వే’ పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని