Modi- Putin: పుతిన్‌- మోదీ ఫోన్‌ సంభాషణ.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వివిధ ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Published : 16 Jan 2024 02:40 IST

దిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం రష్యా అధినేత పుతిన్‌ (Putin)తో టెలిఫోన్‌ సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌, రష్యాల మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ సానుకూల పరిణామాలపై చర్చించాం. ‘బ్రిక్స్‌ (BRICS)’ కూటమికి మాస్కో నాయకత్వం సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’’ అని తెలిపారు.

ఇరుదేశాల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై పురోగతిని నేతలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘బ్రిక్స్‌’కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రష్యాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పినట్లు వెల్లడించింది. భారత్‌ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పింది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇటీవల మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు, పుతిన్‌తోనూ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు పుతిన్ ఆ సందర్భంగా తెలిపారు.

చైనా.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదట!

దాదాపు రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నప్పటికీ.. భారత్‌తో మాత్రం రష్యా సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఆచితూచి అడుగులు వేస్తోన్న దిల్లీ.. దౌత్యం, సంప్రదింపుల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని ఇరుదేశాలకు సూచిస్తోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తోంది. ఐరాసలో ఉక్రెయిన్‌ అనుకూల తీర్మానాల విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడి తట్టుకొని స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా.. మాస్కో- దిల్లీల మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని పుతిన్‌ కూడా స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని