రక్తం వేరైనా కిడ్నీ మార్పిడి!

కిడ్నీ మార్పిడి! మనిషిని చావు కోరల్లోంచి బయటపడేసే అద్భుత మార్గం!! నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ.. వ్యర్థాలను, విషతుల్యాలను వేరు చేసి.. వాటిని మూత్రం రూపంలో బయటికి పంపించే కిడ్నీలు పూర్తిగా చేతులెత్తేసినప్పుడు డయాలిసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు.

Updated : 13 Dec 2022 07:05 IST

కిడ్నీ మార్పిడి! మనిషిని చావు కోరల్లోంచి బయటపడేసే అద్భుత మార్గం!! నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ.. వ్యర్థాలను, విషతుల్యాలను వేరు చేసి.. వాటిని మూత్రం రూపంలో బయటికి పంపించే కిడ్నీలు పూర్తిగా చేతులెత్తేసినప్పుడు డయాలిసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. వీటిల్లో కిడ్నీ మార్పిడి ఉత్తమమైంది. కానీ అవసరమైన సంఖ్యలో కిడ్నీ దాతలు అందుబాటులో లేకపోవటమే పెద్ద సమస్య. దాతలు దొరికినా రక్తం గ్రూపు సరిపడకపోవటం మరో సమస్య. ఇక్కడే ‘ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ ప్రక్రియ ఆదుకుంటోంది. రక్తం గ్రూపు సరిపడకపోయినా సురక్షితంగా కిడ్నీ మార్పిడికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. కాబట్టే దీనికి రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది.

న శరీరంలో నిరంతరం ఎన్నో జీవక్రియలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఎన్నెన్నో వ్యర్థాలు, విషతుల్యాలు పుట్టు కొస్తుంటాయి. వీటిల్లో కొన్ని రక్తంలో కలుస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు పోతేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. కిడ్నీలు విఫలమైతే జరిగేది ఇదే. దీర్ఘకాల కిడ్నీజబ్బు చివరిదశలోకి చేరుకున్నాక.. మందులతో ఇక ఎలాంటి ప్రయోజనం లేదని భావించినప్పుడు డయాలిసిస్‌.. లేదూ కిడ్నీ మార్పిడే శరణ్యం. అయితే ఇంట్లోనే ఉండి చేసుకునే పెరిటోనియల్‌ డయాలిసిస్‌తో అయినా.. ఆసుపత్రిలో ప్రత్యేక పరికరంతో చేసే హిమో డయాలిసిస్‌తో అయినా 50-60 శాతమే రక్తం శుద్ధి అవుతుంది. హిమో డయాలిసిస్‌ కోసం వారానికి మూడు సార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పొంచి ఉంటుంది. దీంతో రోజువారీ జీవితం అస్తవ్యస్త మవుతుంది. అందుకే దాతలు అందుబాటులో ఉంటే ముందు కిడ్నీ మార్పిడికే మొగ్గు చూపుతారు. ఇది సహజ కిడ్నీ మాదిరిగానే పనిచేస్తుంది. రోజువారీ జీవనం మెరుగవుతుంది. జీవనకాలమూ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం కిడ్నీ మార్పిడి అవసరమైనవారిలో 5% మందికే కిడ్నీలు అందుబాటులో ఉంటున్నాయి. మిగతా 95% మంది ఎదురు చూపులు చూస్తున్నవారే. దీనికి ప్రధాన కారణం దాతలు దొరక్కపోవటం. అవయవ మార్పిడి చట్టం ప్రకారం కుటుంబ సభ్యులెవరైనా అవయవ దానం చేయొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో కమిటీ సూచనల మేరకు ఇతరుల నుంచీ అవయవాలు తీసుకోవచ్చు. జీవన్మృతుల అవయవాలనూ మార్పిడి చేయొచ్చు. అయితే దాతలు దొరికినా అన్నిసార్లూ రక్తం గ్రూపు సరిపోవాలనేమీ లేదు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల రక్తం గ్రూపులూ వేరుగా ఉండొచ్చు. కిడ్నీ దాతల్లో సుమారు 40-50% మంది ఇలా వేరే రకం గ్రూప్‌ రక్తం గలవారే ఉంటున్నారు. మనదేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మందికి కిడ్నీ మార్పిడి లేదా డయాలిసిస్‌ అవసరమవుతోందని అంచనా. వీరిలో 7వేల నుంచి 8వేల మందే కిడ్నీ మార్పిడికి నోచుకుంటున్నారు. మిగతావాళ్లంతా డయాలిసిస్‌ చేసుకుంటూ జీవన్మృతుల అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారే. జీవన్మృతుల కిడ్నీ దొరికినా కూడా కొందరు గుండె వైఫల్యం వంటి సమస్యలతో మార్పిడి చేయలేని స్థితికి చేరుకుంటుంటారు కూడా. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి ‘ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిపై అవగాహన పెరిగితే కిడ్నీల కోసం ఎదురుచూస్తున్నవారిలో 30-40% మందికి ఊరట లభించినట్టే.

ఎలా చేస్తారు?

ముందుగా రక్తపరీక్షతో తిరస్కరించే యాంటీబాడీల సంఖ్యను లెక్కిస్తారు. ఇవి 1:8 నిష్పత్తిలో ఉంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కొందరికివి 1:16 నుంచి 1:128, 1:256 వరకు ఉండొచ్చు. ప్లాస్మాఫెరెసిస్‌ ప్రక్రియతో వీటిని తొలగిస్తారు. దీన్ని 3, 4 సార్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏబీఓ/ఏబీల సంఖ్య ఒకేసారి తగ్గదు. చికిత్స చేస్తున్నకొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. ఇవి 1:8 కన్నా తక్కువకు చేరుకునేంతవరకు ప్లాస్మాఫెరెసిస్‌ చేస్తారు. యాంటీబాడీలు మరీ పెద్ద మొత్తంలో ఉంటే ఇమ్యునో అడ్జార్‌ప్షన్‌ చికిత్స. చేస్తారు. యాంటీబాడీలు 1:8 లోపు చేరుకున్నాక మామూలు కిడ్నీ మాదిరిగానే మార్పిడి చేస్తారు. ప్లాస్మాఫెరెసిస్‌ చేయటానికి రెండు వారాల ముందే రిటుక్సిమాబ్‌ ఇంజెక్షన్‌ కూడా ఇస్తారు. ఇది చాలా కీలకం. కొత్తగా తిరస్కరించే యాంటీబాడీలు ఉత్పత్తి కాకుండా చూడటానికిది అత్యవసరం. దీని మూలంగానే ప్లీహాన్ని తొలగించాల్సిన అవసరం తప్పిందని చెప్పుకోవచ్చు.

మార్పిడి తర్వాత..

తొలివారాల్లో కిడ్నీ పనితీరు బాగుంటే యాంటీబాడీ పరీక్ష అవసరమేమీ ఉండదు. కిడ్నీ పనితీరు తగ్గితే మాత్రం యాంటీబాడీ పరీక్ష చేస్తారు. సాధారణంగా కిడ్నీ మార్పిడి అనంతరం రెండు నుంచి నాలుగు వారాల్లోపు తిరస్కరించే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ వీటి సంఖ్య పెరిగితే మరోసారి ప్లాస్మాఫెరెసిస్‌ అవసరమవుతుంది. మార్పిడి చేశాక నాలుగు వారాల తర్వాత తిరస్కరించే యాంటీబాడీలు పుట్టుకొచ్చినా ఎలాంటి నష్టముండదు. అప్పటికి శరీరం కిడ్నీని సొంతం చేసుకుంటుంది. సహజ కిడ్నీలాగే పనిచేస్తుంది. రక్తం గ్రూపు సరిపోయినవారి నుంచి తీసుకున్న కిడ్నీ మాదిరిగానే ఇదీ పని చేస్తుండటం విశేషం. సాధారణంగా రక్తం గ్రూపు సరిపోయినవారి నుంచి తీసుకున్న కిడ్నీలు 98-97% మందిలో సాఫీగా పని చేస్తుంటాయి. రక్తం గ్రూపు సరిపోనివారి నుంచి తీసుకున్న కిడ్నీ మార్పిడి సైతం ప్లాస్మాఫెరెసిస్‌ తర్వాత 96% వరకు విజయవంతమవుతోంది.

ఎన్నో ప్రయోజనాలు

ఒకే రక్తం గ్రూపు దాతలు దొరకనప్పుడు ఈ చికిత్స పద్ధతిలో వేరే రక్తం గ్రూపు వారి కిడ్నీని మార్పిడి చేయటమే మంచిది. లేకపోతే జీవన్మృతుల కిడ్నీ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. లేదూ జీవితాంతం డయాలిసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలసిస్‌ మీదుండే వారిలో చాలామంది జీవన్మృతుల కిడ్నీ దొరికేలోపే మరణిస్తుండటం గమనార్హం. కొందరు మార్పిడి శస్త్రచికిత్సను తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంటారు కూడా. అందువల్ల డయాలసిస్‌ మీదుండేవారికి రక్తం గ్రూపు సరిపోయిన వారి కిడ్నీ దొరకనప్పుడు ఏబీఓ ఇన్‌కంపాటబిలిటీ మార్పిడి ప్రక్రియను నిజంగా  ప్రాణదాయినిగా చెప్పుకోవచ్చు. పైగా జీవన్మృతులతో పోలిస్తే జీవించి ఉన్నవారి నుంచి తీసిన కిడ్నీలు మరింత సమర్థంగా పనిచేస్తాయి కూడా.  

అధునాతన మార్పులతో కొత్తగా..

నిజానికి ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియ కొత్తదేమీ కాదు. బెల్జియంలో 60, 70ల్లోనే మొదలైంది. అయితే ఫలితాలు అంత బాగుండేవి కావు. కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిలో 75% మందిలోనే సఫలమయ్యేవి. అప్పట్లో ప్లీహాన్ని మొత్తం తొలగించేవారు. రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులను ఎక్కువ మోతాదులోనూ ఇస్తుండేవారు. దీంతో త్వరగా ఇన్‌ఫెక్షన్లు వస్తుండేవి. అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావటంతో ఈ ప్రక్రియ రాన్రానూ మెరుగవుతూ వచ్చింది. ముఖ్యంగా రిటుక్సిమాబ్‌ ఇంజెక్షన్‌ అందుబాటులోకి రావటంతో పరిస్థితి చాలావరకు మారిపోయింది. ప్లీహాన్ని తొలగించకుండానే కిడ్నీ మార్పిడి చేయటం దీంతోనే సాధ్యమైంది. ఫలితాలూ మెరుగయ్యాయి. ప్రస్తుతం జపాన్‌లో 40% కిడ్నీ మార్పిడిలు ఈ ప్రక్రియతోనే నిర్వహిస్తుండం విశేషం. అక్కడి చట్టం ప్రకారం- జీవన్మృతుల అవయవాలను మార్పిడి చేయటం కుదరదు. దాతల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రక్తం సరిపోనివారి నుంచీ కిడ్నీలు తీసి, మార్పిడి చేయటానికే అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది మనకూ బాగా ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జాగ్రత్తలు తప్పనిసరి

రక్తం గ్రూపు సరిపోయినా, సరిపోకపోయినా ఇతరుల నుంచి తీసుకున్న అవయవాలను శరీరం తిరస్కరించటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులను జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. తొలి మూడు నెలల్లో వీటిని కాస్త ఎక్కువ మోతాదులో ఇస్తారు. తర్వాత మామూలు మోతాదుకు తగ్గిస్తారు.

* రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకోవటం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తొలి మూడు నెలల్లో ఎక్కువ మంది గుమిగూడే చోట్లకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే మాస్కు ధరించాలి. ఇంట్లో ఎవరికైనా జలుబు, జ్వరం వస్తే వారికి దూరంగా ఉండాలి.

* ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్నే తినాలి. నిల్వ చేసినవి తినొద్దు.

* అతి ముఖ్యమైన జాగ్రత్త- మందులు క్రమం తప్పకుండా వాడటం. కిడ్నీ మార్పిడి చేయించుకోగానే అంతా బాగయ్యిందని చాలామంది భావిస్తుంటారు. మూడు నాలుగు నెలల వరకు డాక్టర్‌ను బాగానే సంప్రదిస్తారు. డాక్టర్లు కిడ్నీ ఎలా ఉంది? ఇన్‌ఫెక్షన్ల లక్షణాలేవైనా కనిపిస్తున్నాయా? అనేది చూస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకపోతే అవే మందులను కాస్త మార్చి సూచిస్తారు. మూడు, నాలుగు నెలలు కాగానే ఎప్పుడు వెళ్లినా డాక్టర్‌ అవే మందులు ఇస్తున్నారుగా అనుకొని కొందరు పరీక్షలు మానేస్తారు. మరో రెండు నెలలు దాటాక అంతా బాగానే ఉంది కదాని మందులు వేసుకోవటం ఆపేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. మార్పిడి చేసిన కిడ్నీలు పని చేయకపోవటానికి ప్రధాన కారణం ఇదే.

* తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరిలా హాయిగా జీవించొచ్చు. మునుపటిలా అన్ని పనులు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. మార్పిడి తర్వాత గర్భం ధరించి, పిల్లలను కన్నవారూ ఉన్నారు.

గ్రూపు మారితే?

కిడ్నీ మార్పిడి విషయంలో దాత, స్వీకర్తల రక్తం సరిపోవటం చాలా ముఖ్యం. మన రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులుంటాయి. ఏ గ్రూపు వారిలో ఏ యాంటిజెన్‌ (యాంటీబాడీలను ఉత్పత్తి చేసే ప్రొటీన్‌).. అలాగే బీ గ్రూపును తిరస్కరించే యాంటీబాడీలు.. బీ గ్రూపు వారిలో బీ యాంటిజెన్‌, ఏ గ్రూపును తిరస్కరించే యాంటీబాడీలు ఉంటాయి. ఏబీ గ్రూపు వారిలో ఏ, బీ యాంటీజెన్లు రెండూ ఉంటాయి. ఇతర గ్రూపులను తిరస్కరించే యాంటీబాడీలేవీ ఉండవు. కాబట్టి వీరికి ఎవరి కిడ్నీనైనా మార్పిడి చేయొచ్చు. కానీ వీరి కిడ్నీ ఏబీ గ్రూపు వారికే సరిపోతుంది. ఓ గ్రూపు వారిలో యాంటీజెన్‌లేవీ ఉండవు. కాబట్టి వీరు ఎవరికైనా కిడ్నీని దానం చేయొచ్చు. కానీ ఏ, బీ గ్రూపులను తిరస్కరించే యాంటీబాడీలు ఉండటం వల్ల వీరికి ఓ గ్రూపు కిడ్నీనే మార్పిడి చేయాల్సి ఉంటుంది. వేరే గ్రూపు రక్తం గలవారి కిడ్నీని మార్పిడి చేస్తే శరీరం దాన్ని తిరస్కరిస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ బయటి నుంచి లోపలికి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి వాటిని ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తుంది. వాటిని బయటకు వెళ్లగొట్టటానికి ప్రయత్నిస్తుంది. వేరే గ్రూపు రక్తం గలవారి అవయవాలను మార్పిడి చేసినప్పుడూ రోగినిరోధక వ్యవస్థ దాన్ని బయటి నుంచి వచ్చిన శత్రువుగానే పరిగణిస్తుంది. యాంటీ-బ్లడ్‌ గ్రూప్‌ యాంటీబాడీ టైటర్లు (ఏబీఓ/ఏబీ) దానిపై దాడి చేసి వెళ్లగొట్టటానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి ప్రమాదాన్ని తప్పించేదే ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియ. దాత రక్తం వేరే అయినా కిడ్నీని స్వీకరించేవారి రక్తంలోంచి తిరస్కరించే యాంటీబాడీలను తొలగించటం దీని ప్రత్యేకత. ఇలా సురక్షిత కిడ్నీ మార్పిడికి వీలు కల్పిస్తుంది.

దాతల విషయంలోనూ..

దాతల నుంచి కిడ్నీలను తీసుకునేటప్పుడు ఒక్క రక్తం గ్రూపునే కాదు. ఇతరత్రా అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

* ఇప్పుడు కిడ్నీలు బాగానే ఉన్నా, మున్ముందు కిడ్నీ జబ్బుకు దారితీసే మధుమేహం గలవారు కిడ్నీ దానానికి తగరు. అలాగే కిడ్నీలను దెబ్బతీసే అధిక రక్తపోటుతో బాధపడేవారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక మందుతో రక్తపోటు అదుపులో ఉంటూ, ఇతరత్రా సమస్యలేవీ లేకపోతేనే కిడ్నీని తీసుకుంటారు. రక్తపోటు ఎక్కువగా ఉంటూ ఒకటి కన్నా ఎక్కువ మందులు వాడుకుంటున్నా.. కిడ్నీజబ్బుతో రక్తపోటు పెరుగున్నట్టు తేలినా దానానికి తగరు.

* మన కిడ్నీలు నిమిషానికి 70-80 మి.లీ. రక్తాన్ని వడపోస్తాయి. దీన్ని ఈజీఎఫ్‌ఆర్‌ అంటారు. ఇది కనీసం 70 ఉండి.. రెండు కిడ్నీల్లోనూ సమానంగా ఉంటేనే దానానికి అర్హులు. ఒకదాంట్లో ఎక్కువ, మరొక దాంట్లో తక్కువ ఈజీఎఫ్‌ఆర్‌ ఉంటే దానం చేయటానికి తగరు.

* కిడ్నీ సామర్థ్యం బాగానే ఉన్నా గుండె, ఊపిరితిత్తుల వంటి ఇతరత్రా సమస్యలుంటే కిడ్నీని బయటకు తీసేటప్పుడు శస్త్రచికిత్సను తట్టుకోలేకపోవచ్చు. ఇలాంటివారు కిడ్నీ దానానికి పనికిరారు.

* రెండు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినవారి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఇలాంటి కిడ్నీల్లో మున్ముందు రాళ్లు ఏర్పడే అవకాశముంది. కాబట్టి వీరి నుంచి తీసుకోరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని