Blood Glucose Diabetes Tests: గ్లూకోజు పరీక్షలో తప్పులు చేయొద్దు!

మధుమేహం దీర్ఘకాల సమస్య. మందులు, ఆహార, వ్యాయామాలతో అదుపులో ఉంచుకోవటం తప్పించి, చేయగలిగిందేమీ లేదు. ఎక్కువకాలం గ్లూకోజు నియంత్రణలో లేకపోతే శరీరం మీద దుష్ప్రభావం చూపుతుంది. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది.

Updated : 15 Aug 2023 10:05 IST

మధుమేహం దీర్ఘకాల సమస్య. మందులు, ఆహార, వ్యాయామాలతో అదుపులో ఉంచుకోవటం తప్పించి, చేయగలిగిందేమీ లేదు. ఎక్కువకాలం గ్లూకోజు నియంత్రణలో లేకపోతే శరీరం మీద దుష్ప్రభావం చూపుతుంది. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల రక్తంలో గ్లూకోజు(Blood Glucose) మోతాదులను తరచూ పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మందులు సరిగా పనిచేస్తున్నాయా, లేదా? ఆహార నియమాలు ఫలితం చూపుతున్నాయా? వ్యాయామం ఇంకా పెంచుకోవాలా? అనేవి తెలుసుకోవటానికిది ముఖ్యం. అయితే చాలామంది గ్లూకోజు పరీక్ష విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. కాబట్టి ల్యాబులో రక్త నమూనా ఇచ్చేటప్పుడైనా, ఇంట్లో గ్లూకో మీటరుతో పరీక్షించుకునేటప్పుడైనా తప్పులు చేయకుండా చూసుకోవటం మంచిది. మూడు నెలల సగటు గ్లూకోజు మోతాదులను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షను రోజులో ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కానీ పరగడుపున, భోజనం తర్వాత చేసే పరీక్షల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.


గ్లూకోజు పరీక్షలో పరగడుపున మందులేసుకోకుండానే..

మధుమేహం(Diabetes) అదుపులో ఉందో లేదో తెలుసుకోవటానికి పరగడుపున రక్తంలో గ్లూకోజు మోతాదులు చాలా కీలకం. అందుకే డాక్టర్లు పొద్దున్నే గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఈ పరీక్ష కోసం రక్త నమూనా ఇచ్చేవారు ఖాళీ కడుపుతోనే ఉండాలి. గ్లూకోజు తగ్గించే మందులేవీ వేసుకోవద్దు. ఇన్సులిన్‌ వాడేవారు ఈ ఇంజెక్షన్‌ తీసుకోవద్దు. అప్పుడే పరగడుపున చేసే రక్త పరీక్షలో గ్లూకోజు మోతాదులు సరిగ్గా తెలుస్తాయి.

* కొందరు ఉదయం గంట సేపు నడిచిన తర్వాత పరగడుపున గ్లూకోజు పరీక్ష చేయించుకుంటుంటారు. ఇది తగదు. నడకకు వెళ్లటానికి ముందే రక్త నమూనా ఇవ్వాలి. కొందరు గ్లూకోజు మోతాదులు తక్కువగా కనిపించాలని పరీక్ష చేయించుకునే రోజు మందులు ఎక్కువ మోతాదులో వేసుకుంటుంటారు. ఇన్సులిన్‌ మోతాదూ పెంచుతారు. ఇదీ మంచిది కాదు.


కడుపు ఖాళీ ఎంతసేపు?

పరగడుపున చేసే పరీక్ష విషయంలో ఎంతసేపు భోజనం తినకుండా ఉన్నారన్నది ముఖ్యం. కొందరు అర్ధరాత్రి 2 గంటలకు భోజనం చేసి ఉదయం 6 గంటలకు పరీక్ష చేయించుకుంటుంటారు. ఉపవాస పద్ధతులు పాటించేవారు సాయంత్రం 6 గంటలకు భోజనం చేసి మర్నాడు ఉదయం 9 గంటలకు రక్త నమూనా ఇస్తుంటారు. దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చేవారు డాక్టర్‌ను సంప్రదించాక ఉదయం 10, 11 గంటలకూ పరీక్ష కోసం వెళ్తుంటారు. ఇవన్నీ తప్పులే. రాత్రి భోజనం చేశాక 8 నుంచి 12 గంటల ఎడమ ఉండేలా చూసుకొని, పరగడుపు గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి.

* కొన్ని మందులు 24 గంటలు పనిచేయవు. ఉదాహరణకు- ఎక్కువగా వాడే మెట్‌ఫార్మిన్‌ 500 మి.గ్రా. మాత్రలు 6-8 గంటల సేపు ప్రభావం చూపుతాయి. రాత్రిపూట వేసుకున్న మాత్ర ఉదయం వరకూ పనిచేయదు కొన్నిసార్లు దీని మూలంగానూ గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉన్నట్టు తేలొచ్చు. అందువల్ల దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.


భోజనానంతరం మందులేసుకున్నాకే..

మధుమేహానికి చికిత్స తీసుకునేవారు భోజనం చేశాక రక్త నమూనా ఇచ్చే ముందు మందులు, ఇంజెక్షన్లు యథావిధిగా వాడుకోవాలి. మందులు వేసుకోకుండా రక్త పరీక్ష చేయించుకోవటం తప్పు. మందులు, ఇన్సులిన్‌ ఇచ్చేదే గ్లూకోజు తగ్గటానికి. ఇవెలా పనిచేస్తున్నాయో తెలుసుకోవటానికే డాక్టర్లు భోజనం చేశాక గ్లూకోజు పరీక్ష చేయిస్తారు. గ్లూకోజు అదుపులో లేకపోతే మందు మోతాదు పెంచుతారు. అదుపులో ఉంటే అలాగే కొనసాగిస్తారు. అవసరమైతే తగ్గించొచ్చు. ఒకవేళ భోజనం చేశాక వేసుకోవాల్సిన మందులు పక్కనపెట్టి, పరీక్ష చేయించుకుంటే గ్లూకోజు మోతాదులు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో మందు సరిపోవటం లేదోమోనని డాక్టర్లు మరింత మోతాదు పెంచొచ్చు. మందు మోతాదు ఎక్కువైతే రక్తంలో గ్లూకోజు స్థాయులు బాగా పడిపోవచ్చు (హైపోగ్లైసీమియా). ఇది చాలా ప్రమాదకరం. దీన్ని సత్వరం గుర్తించి జాగ్రత్త పడకపోతే కళ్లు తిరిగి పడిపోవచ్చు. స్పృహ కోల్పోవచ్చు.


సరిగ్గా 2 గంటలకు..

భోజనం చేశాక సరిగ్గా రెండు గంటల తర్వాత రక్త నమూనా ఇవ్వాలి. భోజనం ముగించాక.. అంటే చివరి ముద్ద తిన్నప్పటి నుంచి ఈ సమయాన్ని లెక్కించుకోవాలి. చాలామంది ల్యాబుకు ఆలస్యంగా వస్తారనే భావనతో మనదగ్గర గంటన్నరకే రావాలని చెబుతుంటారు. ఇప్పుడు ఇదొక ప్రమాణంగానూ మారిపోయింది. ఒకవేళ భోజనం చేశాక రెండు గంటల్లోపే పరీక్ష చేస్తే గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటాయి. దీని ఆధారంగా మందు మోతాదు పెంచినట్టయితే హైపోగ్లైసీమియా తలెత్తే ప్రమాదముంది. కాబట్టి సమయాన్ని పాటించటం ముఖ్యం.

* కొందరు వేడుకలు, పెళ్లిళ్లకు వెళ్లి వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకుంటుంటారు. సాధారణంగా విందు భోజనాల్లో కాస్త ఎక్కువగానే తింటారు. మందులు కూడా సరిగా వేసుకోకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష చేస్తే గ్లూకోజు మోతాదు ఎక్కువగా ఉన్నట్టు తేలుతుంది. అన్ని రోజుల్లో మాదిరిగానే తింటూ, మందులన్నీ సక్రమంగా వాడుకుంటూ పరీక్ష చేసుకుంటేనే గ్లూకోజు మోతాదులు సరిగ్గా తెలుస్తాయని అంతా గుర్తించాలి.


ఆలస్యమైతే ఫలితాలు తారుమారు

ఇప్పుడు ఇంటికి వచ్చి రక్త నమూనాలు తీసుకునే ధోరణి ఎక్కువైంది. కదల్లేనివారు, వృద్ధుల వంటి వారికిది మేలు చేసేదే. కానీ రక్త నమూనా తీసిన తర్వాత వీలైనంత త్వరగా పరీక్ష చేస్తేనే కచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆలస్యమైతే ఫలితాలు మారిపోవచ్చు. సాధారణంగా రక్తంలోని ఎర్ర రక్తకణాలను వేరు చేసి గ్లూకోజు మోతాదులను పరీక్షిస్తారు. వీటిని వేరు చేయకుండా ల్యాబుకు పంపించినప్పుడు సమయం గడుస్తున్నకొద్దీ ఎర్ర రక్తకణాలు గ్లూకోజును వాడుకుంటాయి. అప్పుడు గ్లూకోజు మోతాదులు తగ్గొచ్చు. కాబట్టి వీలైనంతవరకు ల్యాబులోనే రక్త నమూనా ఇవ్వాలి. లేదా వీలైనంత త్వరగా నమూనా ల్యాబుకు చేరుకునేలా చూడాలి.


వ్యాయామం, ఆహారం యథావిధిగా

కొందరు పరీక్ష చేయించుకోవటానికి ముందు రోజుల్లో మాత్రమే బాగా వ్యాయామం చేసి, తిండి తగ్గిస్తుంటారు. ఇది మంచిది కాదు. కేవలం పరీక్షకు ముందే జాగ్రత్తలు తీసుకోవటమనేది ఎవరికి వారు మోసం చేసుకున్నట్టే. దీంతో గ్లూకోజు మోతాదులు తగ్గినట్టు ఫలితం రావొచ్చు. కాబట్టి ప్రతి రోజూ తినే ఆహారం తింటూ, చేసే వ్యాయామం చేస్తూనే గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే జబ్బు ఎలా ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది.


గ్లూకోమీటరు వాడితే..?

ప్రస్తుతం ఇంట్లోనే గ్లూకోమీటరుతో పరీక్షించుకోవటమూ ఎక్కువైంది. ముఖ్యంగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకునేవారికిది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. దీని విషయంలోనూ చాలామంది పొరపాట్లు చేస్తుంటారు.
* రోజూ ఒకే వేలికి సూదిని గుచ్చొద్దు. అలా చేస్తే నొప్పి తలెత్తుతుంది. చిన్న పుండు పడొచ్చు కూడా. వేర్వేరు వేళ్ల నుంచి నమూనా తీయాలి. ఒక రోజు కుడి చేయి వేలు, మరో రోజు ఎడమ చేయి వేలి నుంచి కూడా రక్తం చుక్క తీసి పరీక్షించుకోవచ్చు.
* కొందరు ఒకే సూదిని నాలుగైదు సార్లు రక్తం తీయటానికి వాడుతుంటారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతుంది. ఒక సూదిని ఒకసారికే వాడుకోవాలి. వెంటనే దాన్ని సరిగా చుట్టచుట్టి, చెత్తబుట్టలో వేయాలి.
* పరీక్షకు ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వేలికి స్పిరిట్‌ రుద్దినట్టయితే అది పూర్తిగా ఆరిన తర్వాతే సూదిని గుచ్చాలి. వేలి కొసను శుభ్రం చేయటానికి నాలుకతో అద్దటమూ తగదు.
* చాలామంది చేసే పొరపాటు నాడులు పెద్దమొత్తంలో ఉండే వేలు పైభాగాన సూదిని గుచ్చటం. దీంతో ఎక్కువ నొప్పి కలుగుతుంది. అందువల్ల వేలు ముందు భాగాన సూదిని గుచ్చి, రక్తం తీయటం మంచిది. దీన్ని తేలికగా గుర్తించాలంటే- దండం పెడుతున్నట్టుగా చేతులను జోడించి, గట్టిగా అదమాలి. బయటకు కనిపించే చోటు నుంచి రక్తం తీయాలి.
* గ్లూకోమీటరు తయారీదారు సూచించిన స్ట్రిప్స్‌ మాత్రమే వాడాలి. గడువు తీరిన, సరిగా భద్రపరచని స్ట్రిప్స్‌తో ఫలితాలు మారిపోయే అవకాశముందనీ తెలుసుకోవాలి.
* ఇంట్లో గ్లూకోమీటరు ఉంది కదాని ఎప్పుడు పడితే అప్పుడు పరీక్షించుకోవద్దు. ఇది గందరగోళానికి దారితీస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని