మెదడు పొరల వాపు గుట్టు తెలిసింది

మెదడు చుట్టూ రక్షణ పొర (మెనింజెస్‌) ఉంటుంది. సూక్ష్మక్రిములు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

Published : 07 Mar 2023 00:24 IST

మెదడు చుట్టూ రక్షణ పొర (మెనింజెస్‌) ఉంటుంది. సూక్ష్మక్రిములు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అయినా బ్యాక్టీరియా మెదడులోకి ఎలా వెళ్తుంది? ప్రాణాంతక మెదడు పొరల వాపు (మెనింజైటిస్‌) సమస్యకు ఎలా కారణమవుతుంది? దీని గుట్టును ఛేదించటంలో హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. బ్యాక్టీరియా మెదడు పొరలోని నాడీ కణాలను బురిడీ కొట్టించి, రోగనిరోధక ప్రతిస్పందనను అణచేసి లోనికి ప్రవేశిస్తున్నట్టు ఎలుకలపై చేసిన అధ్యయనంతో గుర్తించారు. మెదడు పొరల వాపునకు కొత్త చికిత్సల రూపకల్పనకిది దారితీయగలదని భావిస్తున్నారు. మెదడులోకి వ్యాధికారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే చిట్టచివరి కణజాల అడ్డంకి మెనింజెసే కావటం వల్ల చికిత్సల విషయంలో దీని మీదే దృష్టిసారించాల్సిన అవసరముందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫెలిప్‌ పినో-రిబీరో అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12లక్షలకు పైగా బ్యాక్టీరియల్‌ మెనింజైటిస్‌ కేసులు నమోదవుతున్నాయి. చికిత్సతో బతికి బట్టకట్టినా ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి లోపం, చూపు పోవటం.. ఫిట్స్‌, దీర్ఘకాల తలనొప్పి, నాడీ సమస్యల వంటి తీవ్ర దుష్పరిణామాలు కొనసాగుతూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని