హరిత ఇళ్లు.. సదా వర్దిల్ల్లు!

ఇంట్లోకి సహజసిద్ధంగా వెలుతురు ప్రసరించాలి.. ఇంధన వినియోగం తక్కువగా ఉండాలి..  నీటి ఆదాతో పాటూ వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. పచ్చదనానికి పెద్దపీట వేయాలి.. వీటితో పాటూ ఇంటి నిర్మాణంలో స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రి వినియోగం..

Published : 09 Jan 2021 02:27 IST

కొవిడ్‌తో ఇంట్లోనే అధిక సమయం
కొనుగోలుదారుల్లో పెరిగిన మొగ్గు
ఈనాడు, హైదరాబాద్‌

ఇంట్లోకి సహజసిద్ధంగా వెలుతురు ప్రసరించాలి.. ఇంధన వినియోగం తక్కువగా ఉండాలి..  నీటి ఆదాతో పాటూ వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. పచ్చదనానికి పెద్దపీట వేయాలి.. వీటితో పాటూ ఇంటి నిర్మాణంలో స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రి వినియోగం.. నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం, సౌర విద్యుత్తు వాడకం... మొత్తంగా పర్యావరణహితంగా హరిత భవనాల వైపు స్థిరాస్తి పరిశ్రమ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) రేటింగ్‌తో నిర్మాణాలు చేపట్టగా.. వీరి బాటలోనే మరికొన్ని పెద్ద, చిన్న సంస్థలు అడుగులు వేస్తున్నాయి. హరిత నిర్మాణాలపై అవగాహన పెరగడంతో ఈ తరహా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కొవిడ్‌తో పిల్లలు ఇంటి నుంచే పాఠాలు, పెద్దలు కార్యాలయ పనులు చేస్తున్నారు. రోజంతా ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా లేకపోతే రోజుల తరబడి ఉండలేరు. ఇదివరకు కార్యాలయాల్లో రోజులో ఎక్కువ సమయం గడిపేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం వెల్‌నెస్‌ భవనాల పోకడలను చేపట్టాయి. హరిత భవనాల్లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం ప్రధానంగా ఉంటే.. వెల్‌నెస్‌లో వీటితో పాటూ సుస్థిర భవనం లక్ష్యంగా నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండేవారి ఆరోగ్యం ప్రాధాన్యంగా ఇంటీరియర్‌ మొదలు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. కొవిడ్‌ అనంతరం నివాసాల్లోనూ వీటికి ప్రాధాన్యం పెరిగింది. విద్యుత్తు ఆదా, సమర్ధంగా నీటి వినియోగం, వ్యర్థాలను వేరు చేయడం వంటి చర్యలతో పాటూ. గాలి నాణ్యత పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం ముఖ్య ఉద్దేశం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని సీఐఐ-ఐజీబీసీ రేటింగ్‌ ఇస్తుంది. హరిత భవనాలు పెద్ద సంఖ్యలో వచ్చేలా.. ఇప్పటికే ఉన్నవాటిని హరిత భవనాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఎంతోకాలంగా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ కోరుతోంది. గత ఏడాది వర్చువల్‌గా జరిగిన గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం కొత్త భవనాలన్నీ తప్పనిసరిగా పర్యావరణహితంగా ఉండేలా కట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, ఇతర చర్యల ద్వారా హరిత భవనాలను ప్రోత్సాహించాలని ప్రభుత్వాలు, ఆర్థిక కమిషన్లు, స్థానిక సంస్థలకు ఆయన సూచించారు.


రాష్ట్రాల వారీగా ప్రోత్సాహకాలు చూస్తే..

పంజాబ్‌: అదనంగా ఐదు శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌) ఆయా ప్రాజెక్ట్‌ల్లో ఉచితంగా ఇస్తోంది. ఐజీబీసీ గోల్డ్‌, అంతకంటే పైన రేటింగ్‌ ఉన్నవాటికి దీన్ని వర్తింపజేస్తోంది.
రాజస్థాన్‌: సిల్వర్‌, గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ ఆధారంగా 7.5, 10, 15 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది.
పశ్చిమ బెంగాల్‌: ఐజీబీసీలో రిజిస్టర్‌ అయిన ప్రాజెక్ట్‌లకు 10 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ ఇస్తోంది.
ఉత్తరప్రదేశ్‌: గోల్డ్‌, అంతకంటే పైన రేటింగ్‌ ఉన్నవాటికి అదనంగా ఐదు శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌) ఆయా ప్రాజెక్ట్‌ల్లో ఉచితంగా ఇస్తోంది.
మహారాష్ట్ర: సిల్వర్‌, గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ ఆధారంగా 3, 5, 7 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్‌: గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ కల్గిన ప్రాజెక్ట్‌లకు 10 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ ఇస్తోంది.
ఝార్ఖండ్‌: సిల్వర్‌, గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ ఆధారంగా 3, 5, 7 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది.


ఎంత ప్రభావం?

ప్రస్తుతం నిర్మాణం చేపట్టే ప్రాంతం, రహదారిపై ఆ భవనం నిర్మాణంతో మౌలిక వసతులపై ప్రభావం ఉంటుంది కాబట్టి ఇంఫాక్ట్‌ ఫీజును వసూలు చేస్తున్నారు గ్రేటర్‌ పరిధిలో నిర్మించే వాణిజ్యభవనాలకు, ఐదు అంతస్తులు దాటిన బహుళ అంతస్తుల భవనాలకు ఈ ఫీజును వసూలు చేస్తున్నారు. హరిత భవనంతో మౌలిక వసతులపై పడే భారం చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఆ మేరకు రుసుముల్లో తగ్గింపు ఇస్తే మేలని కొందరు బిల్డర్లు కోరుతున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని