స్థిరాస్తుల్లో ఆమె అడుగులు

మహిళలు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపిస్తుంటారు. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నప్పటికీ.. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వీరి ప్రాధాన్యాలు మారుతున్నాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగంలో చేరగానే

Published : 13 Mar 2021 02:17 IST

పుత్తడి నుంచి క్రమంగా మారుతున్న పెట్టుబడులు
ఈనాడు, హైదరాబాద్‌

మహిళలు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపిస్తుంటారు. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నప్పటికీ.. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వీరి ప్రాధాన్యాలు మారుతున్నాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగంలో చేరగానే వచ్చే సంపాదనతో పుత్తడి, షేర్లతో పాటూ స్థలాలు, ఇళ్లపైన వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు. వీరు 9 శాతం వరకు ఉంటారని అనరాక్‌, ట్రాక్‌-2 రియాలిటీ సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పోకడను స్థిరాస్తి సంస్థలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తమ సేల్స్‌, మార్కెటింగ్‌లో మహిళా సిబ్బందిని పెంచడం,  మేనేజ్‌మెంట్‌లో స్థానం కల్పించడం ద్వారా మహిళా కొనుగోలుదారులకు మరింత చేరువ కావొచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆచరణలో పెట్టాయి.  
స్థిరాస్తులపై నిర్ణయాల్లో పురుషులదే ఆధిపత్యం.. ఇప్పుడిప్పుడే ఇది మారుతోంది. మహిళలు సైతం ఉద్యోగాలు, వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ చిన్న వయసులోనే ఐదంకెల వేతనాలు అందుకుంటున్నారు. ఇదివరకు ఆర్థిక వ్యవహారాలపై అంతగా అవగాహన లేకపోవడంతో సంపాదన మొత్తం తల్లిదండ్రులకు అప్పగించేవారు. ఇప్పుడు తమ సంపాదనలో వేటిలో ఎంత మొత్తం వెచ్చించాలో స్పష్టమైన అవగాహనతో యువతులు ఉన్నారు. పెళ్లిని దృష్టిని పెట్టుకుని సంప్రదాయంగా వస్తున్న బంగారంతో పాటూ దీర్ఘకాలం దృష్ట్యా స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. వీరు ఎక్కువగా పెట్టుబడి కోణంలో చూస్తున్నారు.  ప్రత్యేకించి ఒక ప్రాంతం అని కాకుండా వృద్ధికి అవకాశం ఉన్న చోట మదుపు చేస్తున్నారు. 

పెళ్లయ్యాక...
వివాహిత మహిళల ఆలోచనలు పెట్టుబడి కంటే సొంతింటి కలను నెరవేర్చుకోవడం చుట్టూనే తిరుగుతున్నాయి. పని ప్రదేశానికి చేరువలో, తమ బడ్జెట్‌లో దొరికే ఆవాసాలవైపు చూస్తున్నారు. పైగా మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నచోటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే యువతులైతే పెట్టుబడి దృష్ట్యా భవిష్యత్తు వృద్ధి అంచనాలతో దూరంగా ఉన్నా.. సరే అంటున్నారు.
ఆమె పేరునే ఆస్తులు  
మొదట్లో స్థిరాస్తులన్నీ ఎక్కువగా మగవారి పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. వారసత్వ ఆస్తులపై సమాన హక్కులు... మహిళలు సైతం సంపాదిస్తుండటతో ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే భార్యాభర్త ఇద్దరి పేరు మీదుగా ఉమ్మడిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళల పేరున రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నవారు ఉన్నారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
స్టాంప్‌ డ్యూటీలో రాయితీ
మహిళలకు పన్నుల్లో రాయితీలు ఇస్తుండటం కూడా ఆమె పేరుతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయిస్తే స్టాంప్‌ డ్యూటీలో ఒక శాతం రాయితీని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ సందర్భంగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ మేరకు ప్రకటన చేయడంతో స్థిరాస్తి సంఘాలు స్వాగతించాయి. అక్కడ స్టాంపు డ్యూటీ 5 శాతంగా ఉంది. మహిళల పేరుతో ఇల్లు కొంటే 4 శాతమే వసూలు చేస్తారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేట్లు..

ప్రస్తుతం గృహరుణ వడ్డీరేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇల్లు కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశం. ఇందులోనూ మహిళల పేరుతో కొనుగోలు చేస్తున్నట్లయితే పలు బ్యాంకులు గృహరుణ వడ్డీరేట్లను మరింత తక్కువకు ఇస్తున్నాయి.

సర్వే ప్రకారం..

* 68% సంపాదన మొదలవగానే స్థిరాస్తులు కొంటామంటున్న యువతులు
* 78% వివాహిత మహిళలు ఇంటిని సామాజిక భద్రతగా చూస్తున్నారు
* 60% ఉద్యోగం చేస్తున్న  మహిళల మొదటి ప్రాధాన్యం సొంతిల్లు
* 60% సంపాదనలో అరవై శాతం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న యువతులు
* 71% ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్లవైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు
* 62% కొవిడ్‌ తర్వాత స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నవారు (అంతకు ముందు 57శాతమే)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని