తృణమో... ఘనమో!
కరిరాజ ముఖుడికి.. గిరి తనయ ప్రేమగా వండి వడ్డించిన పదార్థాలు కుడుములు.. ఉండ్రాళ్లు.. మోదక్లు.. అమ్మ చేసినవన్నీ కడుపారా ఆరగించి ఆయాసపడ్డాడు గజాననుడు! అది చూసి చంద్రుడు నవ్వడం, పార్వతీదేవి శాపమివ్వడం పురాణ గాథ! నేటికీ వినాయక చవితి వచ్చిందంటే చాలు బొజ్జ గణపయ్యకు ఇష్టమైనవి చేయడం మన సంప్రదాయం.
ఏకదంతునికి ‘చిరు’విందులు
కరిరాజ ముఖుడికి.. గిరి తనయ ప్రేమగా వండి వడ్డించిన పదార్థాలు కుడుములు.. ఉండ్రాళ్లు.. మోదక్లు.. అమ్మ చేసినవన్నీ కడుపారా ఆరగించి ఆయాసపడ్డాడు గజాననుడు! అది చూసి చంద్రుడు నవ్వడం, పార్వతీదేవి శాపమివ్వడం పురాణ గాథ! నేటికీ వినాయక చవితి వచ్చిందంటే చాలు బొజ్జ గణపయ్యకు ఇష్టమైనవి చేయడం మన సంప్రదాయం. పండగ వంటకాలు ఎలాగూ ఉంటాయి. దీనికి తోడు స్వామి పేరు చెప్పి నాలుగు కుడుములు.. ఇంకో నాలుగు ఉండ్రాళ్లు.. ఆపై మోదక్లు సుబ్బరంగా లాగించేస్తే.. ఏకదంతుడికి మల్లే కడుపు ఉబ్బరంతో ఆయాసం తప్పదు! అలా కావొద్దంటే.. తృణ ధాన్యాలతో తీర్చిదిద్దిన కుడుములు, ఉండ్రాళ్లు ఆరగించండి.. తృణధాన్యాలతో తయారు చేసిన మోదక్లను ఆస్వాదించండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
రాగి ఉండ్రాళ్లు కావాల్సినవి: రాగిపిండి- కప్పు, బెల్లం తురుము- కప్పు, పచ్చికొబ్బరి తురుము- కప్పు, జీడిపప్పులు- పది, నెయ్యి- తగినంత, నీళ్లు- తగినన్ని తయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు వేసి మరిగించుకోవాలి. దీంట్లో బెల్లం వేసి కరిగేంతవరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చికొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరో రెండు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు రాగిపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండ కట్టకుండా కలుపుతూ ఉండాలి. మంట తగ్గించి మూతపెట్టి ఐదునిమిషాలపాటు ఉడికించుకోవాలి. పిండి గట్టిపడి ముట్టుకుంటే చేతికి అంటుకోకూడదు. ఇప్పుడు మంటఆపి పావుగంటపాటు చల్లార్చుకోవాలి. అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు చేసుకుని ఇడ్లీ కుక్కర్లో ఎనిమిది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఉండ్రాళ్లపై నేతిలో వేయించిన జీడిపప్పులని అందంగా అలంకరించుకుని నైవేద్యంగా పెట్టొచ్చు. * క్యాల్షియం, విటమిన్ డి, పీచు పుష్కలంగా ఉండే రాగులు బరువు తగ్గడానికి సహకరిస్తాయి. రక్తహీనత తలెత్తకుండా చూస్తాయి. |
కొర్ర కుడుములు కావాల్సినవి: బియ్యప్పిండి- అరకప్పు, నీళ్లు- రెండు కప్పులు, ఉడికించిన కొర్రలు- అరకప్పు, బెల్లం- అరకప్పు, కొబ్బరి తురుము- పావుకప్పు, యాలకులపొడి- చిటికెడు, ఉడికించిన సెనగపప్పు- మూడు చెంచాలు, నెయ్యి, ఉప్పు- తగినంతతయారీ: ఒక గిన్నెలో నీటిని మరిగించుకోవాలి. దాంట్లో బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కొర్రలు, కొబ్బరి, యాలకులపొడి వేసి మళ్లీ మరిగించుకోవాలి. కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండ కట్టకుండా కలుపుకోవాలి. పిండి దగ్గరకు వచ్చాక ఎనిమిది నిమిషాలపాటు సన్నమంటపైన ఉంచి మూతపెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. సెనగపప్పుని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుని నీళ్లు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి. ఈ సెనగపప్పుని ఉడికించిన కొర్రల మిశ్రమంలో కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని... చిన్న ఉండలుగా చేసుకుని ఆవిరిమీద ఎనిమిది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. * కొర్రల్లో మెండుగా ఉండే ఇనుము మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అల్జీమర్స్ రాకుండా చేస్తుంది. ముఖంలో వయసు కారణంగా వచ్చే ముడతల్ని అడ్డుకుంటాయి.
ఏకదంతునికి ‘చిరు’విందులు |
సజ్జ మోదక్లు కావాల్సినవి: సజ్జలు- 150గ్రా, బెల్లం- 100గ్రా, కొబ్బరి తురుము- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, యాలకులపొడి- చిటికెడు, నీళ్లు- తగినన్నితయారీ: సజ్జలని మెత్తగా పిండి ఆడించుకోవాలి. లేదంటే బజారులో దొరికే సజ్జపిండిని కూడా వాడుకోవచ్చు. బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఒక గిన్నెలో సజ్జపిండి, బెల్లం, యాలకులపొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పచ్చికొబ్బరి, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి తడుపుకొని మోదక్లుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కానీ మోదక్ కుక్కర్లో కానీ ఉంచి కప్పు నీళ్లు పోసుకుని, పాత్రకు కొద్దిగా నెయ్యిరాసి మోదక్లని ఆవిరిమీద ఐదు నుంచి ఎనిమిది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. వేడివేడిగా తింటే బాగుంటాయి. * పొడవైన, బలమైన జుట్టు కావాలనుకునేవారికి సజ్జలు ఎంతగానో సహకరిస్తాయి. చర్మం తేమతో నిగారించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మోదక్లు చేయడానికి స్టీల్ లేదా ప్లాస్టిక్తో చేసిన మోదక్ మేకర్లు బజారులో దొరుకుతుంటాయి. వాటితో ప్రయత్నిస్తే చేతికి శ్రమ లేకుండా అందమైన మోదక్లు కనువిందు చేస్తాయి. |
ఊదల పూర్ణాలు కావాల్సినవి: బియ్యప్పిండి- అరకప్పు, సెనగపప్పు- అరకప్పు, నెయ్యి- చెంచా, బెల్లం- అరకప్పు, పచ్చికొబ్బరి తురుము- రెండు చెంచాలు, ఉడికించిన ఊదలు- పావుకప్పు, డ్రైఫ్రూట్స్ ముక్కలు- పిస్తా, జీడిపప్పులు, బాదం, కిస్మిస్ అన్ని కలిపి మూడు చెంచాలు తయారీ: సెనగపప్పుని నానబెట్టుకోవాలి. తర్వాత పలుకుగా ఉడికించి నీళ్లు మొత్తం వడకట్టి పెట్టుకోవాలి. మిక్సీలో సెనగపప్పు, బెల్లం, యాలకులపొడి, ఉడికించిన ఊదలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో వెంటనే సన్నని పలుకులుగా చేసుకున్న డ్రైఫ్రూట్స్ని వేసుకుని చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో కప్పు నీళ్లు తీసుకుని మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో అరకప్పు బియ్యప్పిండిని ఉండలు కట్టకుండా నెమ్మదిగా వేస్తూ ఉండాలి. పిండి దగ్గరకు వచ్చాక సన్నని మంట మీద ఉంచి అంచులు వీడిపోయేంతవరకూ ఉడికించుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా పిండి తీసుకుని వేళ్లతో అదిమిపెట్టి రొట్టె మాదిరిగా చేసుకుని అందులో పూర్ణాన్ని ఉంచాలి. అన్నివైపుల నుంచి మూసి వేసి ఆవిరిమీద ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఊదలపూర్ణం కుడుములు ఎంతో రుచిగా ఉంటాయి. * కెలొరీలతోపాటు దీని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటంతో మధుమేహం, గుండెజబ్బులు ఉండేవారికి ఈ ఆహారం ఎంతగానో మేలు చేస్తుంది. మోదక్ లేదా కుడుములు చేయడానికి... కుక్కర్లు కూడా ఉంటాయి. వీటితో ఉండ్రాళ్లని తేలికగా చేసుకోవచ్చు. |
మిల్లెట్ మోదక్ కావాల్సినవి: మైదా- అరకప్పు, అన్ని తృణధాన్యాలు కలిపిన పిండి- పావుకప్పు, గోధుమపిండి- పావుకప్పు, బెల్లం- కప్పు, పచ్చికొబ్బరి తురుము- అరకప్పు, యాలకులపొడి- చిటికెడు, సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు- మూడు చెంచాలు, నెయ్యి- రెండు చెంచాలు, నూనె- చెంచా, ఉప్పు- తగినంత తయారీ: ఒక గిన్నెలో మైదాపిండి, అన్ని తృణధాన్యాలు కలిపిన పిండి(మల్టీమిల్లెట్ గ్రైన్స్ ఫ్లోర్), గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, తగినంత నీరుపోసి పిండిని ముద్ద చేసుకోవాలి. కావాలంటే ఈ పిండిలో ఒక చెంచా బొంబాయి రవ్వ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు చెంచాల నెయ్యి పోసుకోవాలి. దీనిలో మొదట పచ్చికొబ్బరితురుము వేసి వేయించుకుని తర్వాత బెల్లం వేసి వేయించుకోవాలి. నెమ్మదిగా బెల్లం కరిగి... తర్వాత క్రమంగా గట్టిపడటం ఆరంభమవుతుంది. అప్పుడు యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి కలుపుకోవాలి. పొయ్యిమీద నుంచి దింపి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందు తయారుచేసుకున్న పిండిలో నుంచి చిన్నచిన్న ఉండలు తీసుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి. బెల్లం మిశ్రమాన్ని చపాతీల మధ్య ఉంచుకుని మోదక్లుగా మలుచుకోవాలి. ఇలా చేసుకున్న మోదక్లను నూనెలో వేయించుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..