సింగ్‌ మిక్చర్‌.. కింగ్ మిక్చర్‌.. టేస్ట్‌ సూపర్‌!

సూర్యాపేట సోలాపూర్‌ సింగ్‌ మిక్చర్‌ ఓ కేజీ పార్సిల్‌ తీసుకురారా.. దుబాయ్‌లోని ఓ ఫ్రెండు రిక్వెస్ట్‌..సూర్యాపేట మీదుగానేగా వచ్చేది అయితే పీఎస్‌ఆర్‌ సెంటర్‌కి వెళ్లి సింగ్‌ మిక్చర్‌ కట్టించుకురా..ఖమ్మంలోని స్నేహితుడి ఆర్డరు..సింగ్‌ మిక్చర్‌ తీసుకెళుదాం డాడీ.. హైదరాబాద్‌ వెళుతున్న ఓ కుటుంబంలోని పిల్లలు తండ్రితో..

Updated : 17 May 2022 14:56 IST

సూర్యాపేట సోలాపూర్‌ సింగ్‌ మిక్చర్‌ ఓ కేజీ పార్సిల్‌ తీసుకురారా.. దుబాయ్‌లోని ఓ ఫ్రెండు రిక్వెస్ట్‌..
సూర్యాపేట మీదుగానేగా వచ్చేది అయితే పీఎస్‌ఆర్‌ సెంటర్‌కి వెళ్లి సింగ్‌ మిక్చర్‌ కట్టించుకురా.. ఖమ్మంలోని స్నేహితుడి ఆర్డరు..
సింగ్‌ మిక్చర్‌ తీసుకెళుదాం డాడీ.. హైదరాబాద్‌ వెళుతున్న ఓ కుటుంబంలోని పిల్లలు తండ్రితో..
అవునండీ.. సూర్యాపేటలో సోలాపూర్‌ సింగ్‌ మిక్చర్‌కు ఉన్న పాపులారిటీ అదీ.. పైగా ఒకటా రెండా 70 ఏళ్లుగా నడుస్తోన్న మిక్చర్‌ సెంటర్‌ మరి! ఆ మాత్రం ఉంటుందిగా.
మిక్చర్‌కు అంత డిమాండా? అనుకోకండీ..రుచి విదేశాలకూ పాకిందంటే దాని స్థాయి ఏంటో అర్థమవుతోందిగా..

 

గుజరాత్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇక్కడే ఎన్నో వ్యాపారాలు.. ఏదీ కలిసి రాలేదు. ఏదో చిన్న పనిమీద మహారాష్ట్రలోని సోలాపూర్‌ వెళ్లిన లక్ష్మీ నారాయణ సింగ్‌ అక్కడ మిక్చర్‌ రుచి చూశాడు. ఎలా తయారు చేస్తారో కొన్ని రోజులు అక్కడే ఉండి నేర్చుకున్నాడు. సూర్యాపేట వచ్చాక సొంతంగా చిన్నగా ఓ తోపుడు బండి మీద అమ్మడం మొదలుపెట్టాడు. ఐదు పైసలతో ప్రారంభించాడు. నేడు మూడో తరం వారు అందిపుచ్చుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. లక్ష్మీనారాయణ సింగ్‌ తర్వాత ఆయన కోడలు లక్ష్మీబాయి సింగ్‌ దీన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసిన కొడుకు ఉపేందర్‌ సింగ్‌ సైతం ఇందులోకి వచ్చాడు. తల్లీ కొడుకులు మిక్చర్‌ సెంటర్‌ను నడిపిస్తున్నారు.
చెగోడి మిక్చర్‌, మిర్చీ మిక్చర్‌, ఆలూ మిక్చర్‌, ఆలూ మసాలా, మిర్చీ మసాలా, కట్‌ మిర్చీ.. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సింగ్‌ మిక్చర్‌గా ప్రజల్లో బాగా ఆదరణ పొందింది. మిక్చర్‌ డ్రై పార్సిల్‌ విదేశాలకు కట్టించుకుంటారు. ఇదీ ఐదు నుంచి ఆరు నెలల దాకా ఉంటుంది. మసాలాను వేసి అన్ని ఐటెమ్స్‌ కలిపి పార్సిల్‌ కడతారు. దీనికి మనం ఇంట్లో ఉల్లిపాయలు, నిమ్మకాయ కలిపితే సరి.
చెగోడీ, సన్నకారప్పూస, మిర్చీబజ్జీ.. ఇలా వీటన్నింటినీ ఇంట్లోనే సొంతంగా తయారు చేస్తారు. అలాగే, ఇందులో కలిపే గరం మసాలాను ప్రత్యేకించి సొంత దినుసులతో తయారు చేస్తారు. అందుకే అంత మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ ముక్కలు జత చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రోజుకు 100 వరకు ఇక్కడి నుంచి పార్సిళ్లు వెళుతుంటాయి. శుభకార్యాలకు కూడా ప్రత్యేకంగా ఆర్డుర్లు వస్తాయి.

-భూపతి సత్యనారాయణ, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని