ఆరు వైద్య పరీక్షలకు ఒకే పరికరం

అరచేతిలో ఇమిడిపోయే చిన్న పరికరంతో ఆరు రకాల వైద్య పరీక్షలు చేసుకునే సాంకేతికతను బ్లూసెమీ అంకుర సంస్థ ఆవిష్కరించింది. దీని ద్వారా సూది గుచ్చకుండా, రక్తనమూనా అవసరం లేకుండా చక్కెర నిల్వలను

Published : 15 Jan 2022 02:50 IST

రక్త నమూనా అవసరం లేకుండా గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకునే వీలు
ఆవిష్కరించిన ట్రిపుల్‌ఐటీలోని ‘బ్లూసెమీ’ అంకుర సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: అరచేతిలో ఇమిడిపోయే చిన్న పరికరంతో ఆరు రకాల వైద్య పరీక్షలు చేసుకునే సాంకేతికతను బ్లూసెమీ అంకుర సంస్థ ఆవిష్కరించింది. దీని ద్వారా సూది గుచ్చకుండా, రక్తనమూనా అవసరం లేకుండా చక్కెర నిల్వలను తెలుసుకునే వీలు కలుగుతుంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌(సీఐఈ)లో బ్లూసెమీ సంస్థ ఉంది. దీన్ని ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థి మద్దికట్ల సునీల్‌ నాలుగున్నరేళ్ల కిందట ప్రారంభించారు. ఈ సంస్థ ‘ఐవా’ పేరిట రూపొందించిన పరికరం సాయంతో బ్లడ్‌ గ్లూకోజ్‌, ఈసీజీ, గుండె వేగం, బీపీ, ఎస్‌పీవో2, ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు.

60 సెకన్లలో వివరాలు
వినియోగదారు తొలుత తన స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను వేసుకోవాలి. బ్లూటూత్‌ సాయంతో పరికరాన్ని అనుసంధానం చేయాలి. అనంతరం పరికరాన్ని అరచేతితో పట్టుకుని 60 సెకన్లు ఉంటే వైద్య పరీక్షల ఫలితాలు యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ‘ఐవా’ సెన్సర్‌ ఆధారంగా కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) సాంకేతికతలను వినియోగించుకుని పనిచేస్తుంది. వైద్యపరీక్షల ఫలితాలు అసాధారణ స్థాయిలో ఉంటే యాప్‌లో ప్రత్యేకంగా ఉండే ‘యాంథియా వర్చువల్‌ ప్రపంచం’లోని వాతావరణం నల్లగా మారిపోతుంది. సాధారణ స్థాయిలో ఉంటే పక్షుల కిలకిలారావాలు, జలపాతాలు, పువ్వులు వంటి ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది.

గణాంకాలే కాదు.. చిట్కాలు
గ్లూకోజ్‌ స్థాయులు, ఉష్ణోగ్రతల గణాంకాలు చెప్పడమే కాకుండా.. అసాధారణ స్థాయిలో ఉంటే తీసుకోవాల్సిన చిన్నపాటి చిట్కాలనూ ‘ఐవా’ సూచిస్తుంది. పరీక్ష చేసుకున్న సమయాన్ని బట్టి సూచనలు చెబుతుంది. ఉదాహరణకు మధ్యాహ్న భోజనం తర్వాత పరీక్ష చేసుకున్నప్పుడు రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తిస్తే.. 20 నిమిషాలు నడవాలని సలహా ఇస్తుంది. ‘‘ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్‌ వేదికగా జరిగిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో(సెస్‌)లో భారత్‌ తరఫున పరికరాన్ని ఆవిష్కరించాం. అన్ని పరీక్షలు దాటుకుని విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. పరికరానికి పేటెంట్‌ కూడా వచ్చింది. వచ్చే మార్చిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తాం. సాధారణ ప్రజలకు జూన్‌కల్లా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.15,490గా నిర్ణయించాం’’ అని బ్లూసెమీ సంస్థ వ్యవస్థాపకుడు మద్దికట్ల సునీల్‌ ‘ఈనాడు’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని