Andhra News: ‘ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి ప్రాణహాని’

ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని హత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం చిన్నాన్న వీధి శ్రీను

Updated : 07 Jul 2022 07:16 IST

పోలీసులను ఆశ్రయించిన సుబ్రహ్మణ్యం చిన్నాన్న శ్రీను

కాకినాడ (బాలాజీ చెరువు, మసీదు సెంటర్‌), న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని హత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం చిన్నాన్న వీధి శ్రీను కాకినాడ రెండో పట్టణ పోలీసులను బుధవారం ఆశ్రయించారు. ప్రజా, దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ‘ఎమ్మెల్సీ కుటుంబం నివాసం ఉంటున్న కాకినాడ, భానుగుడి, శంకర్‌ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాను. మా అన్నయ్య కుమారుడి హత్య కేసులో సాక్షులుగా ఉన్న మాకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయి.

ఈ నెల 5న మధ్యాహ్నం ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి, అక్క.. నా కుమార్తెలను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ.. ‘మిమ్మల్ని మేమే ఇక్కడ పనిలో పెట్టాం.. ఆ విశ్వాసం లేకుండా నా కుమారుడిని జైలు పాలు చేస్తారా అంటూ.. మా వాడు బయటకు రాగానే మీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారని ఆయన తెలిపారు. సాక్షులుగా ఉన్న మమ్మల్ని చంపుతామని బెదిరించిన ఎమ్మెల్సీ తల్లి, సోదరిపై చర్యలు తీసుకుని మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని తెలిపారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న వీధి శ్రీను, అతడి కుటుంబీకులకు రక్షణ కల్పించి.. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న అతడి చిన్నాన్న వీధి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులను దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు పిట్టా వరప్రసాద్‌, తోకల ప్రసాద్‌, అయితాబత్తుల ఆనందరావు, ఏనుగుపల్లి కృష్ణ, తాళ్లూరి రాజు తదితరులు కలిసి ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని