PAN-Aadhaar: ఆధార్‌తో లింక్‌.. 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీయాక్టివ్‌

PAN-Aadhaar link: ఆధార్‌తో అనుసంధానం చేయని కారణంగా 11.5 కోట్ల పాన్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆర్‌టీఐ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Updated : 10 Nov 2023 13:12 IST

PAN-Aadhaar | ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్దేశిత గడువులోగా ఆధార్‌ కార్డుతో (PAN-Aadhaar) లింక్‌ చేయని కారణంగా దేశవ్యాప్తంగా 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీయాక్టివ్‌ అయ్యాయి. అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగియడంతో ఈ కార్డులు డీయాక్టివ్‌ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్‌ కార్డు హోల్డర్లు ఉండగా.. అందులో 57.25 కోట్ల మంది ఆధార్‌తో తమ పాన్‌ను అనుసంధానం చేసుకున్నారని సీబీడీటీ తెలిపింది. 12 కోట్ల పాన్‌కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం చేయకపోగా.. అందులో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివ్‌ అయినట్లు వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త శేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన ఆర్‌టీఐ (RTI) దరఖాస్తుకు ఈ మేరకు సీబీడీటీ సమాధానం ఇచ్చింది. 2017 జులై 1 కంటే ముందు జారీ చేసిన పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దఫదఫాలుగా కేంద్రం గడువును పొడిగిస్తూ వచ్చింది. తొలుత మార్చి 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇవ్వగా.. చివరి అవకాశంగా జూన్‌ 30 వరకు గడువు ఇచ్చింది.

డెడ్‌లైన్‌ మిస్ అయ్యారా? ఇలా చేస్తే పాన్‌ యాక్టివేట్‌

డీయాక్టివేట్‌ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సీబీడీటీ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం రూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే 2023 జూన్‌ 30 గడువును మిస్‌ అయ్యి ఉంటారో.. వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్‌ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అయితే, పాన్‌ కార్డును పునరుద్ధరించడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఈ లోగా నిరుపయోగంగా మారిన కారణంగా పాన్‌ కార్డును లావాదేవీలకు వినియోగించలేరు. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చి 28న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రూ.1000 ఫైన్‌ చెల్లించి ఆధార్‌ అధికారులకు ఆ విషయం వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్‌ కార్డును పునరుద్ధరించుకోవచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని