PAN- Aadhaar: డెడ్‌లైన్‌ మిస్ అయ్యారా? ఇలా చేస్తే పాన్‌ యాక్టివేట్‌

PAN- Aadhaar deadline: పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి నిర్దేశించిన గడువు మిస్‌ అయ్యారా? పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిందా? అయితే వారికి ఇంకో అవకాశం ఉంది.

Updated : 03 Jul 2023 15:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాన్‌ కార్డును ఆధార్‌తో (PAN-Aadhaar) అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. జూన్‌ 30లోగా ఎవరైతే జరిమానా చెల్లించి అనుసంధానం పూర్తి (PAN- Aadhaar link) చేసి ఉంటారో వారికి పాన్‌ ఎప్పటిలానే పనిచేస్తుంది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి పాన్‌ కార్డులు నిరుపయోగంగా మారుతాయని ఇది వరకే ఆదాయపు పన్ను శాఖ (Income tax Dept) స్పష్టం చేసింది. పాన్‌-ఆధార్‌ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఈసారి గడువు పొడిగించలేదు. దీంతో పాన్‌ కార్డు హోల్డర్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అయితే, పాన్‌ కార్డులను మళ్లీ పునరుద్ధరించుకునేందుకు ఇంకో అవకాశం మిగిలే ఉంది.

ఎవరైతే 2023 జూన్‌ 30 గడువును మిస్‌ అయ్యి ఉంటారో.. వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్‌ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అయితే, పాన్‌ కార్డును పునరుద్ధరించడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఈ లోగా నిరుపయోగంగా మారిన కారణంగా పాన్‌ కార్డును లావాదేవీలకు వినియోగించలేరు. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చి 28న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రూ.1000 ఫైన్‌ చెల్లించి ఆధార్‌ అధికారులకు ఆ విషయం వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్‌ కార్డును పునరుద్ధరించుకోవచ్చని పేర్కొంది. 

సీబీడీటీ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఇప్పటికీ రూ.1000 చెల్లించి మీ పాన్‌ కార్డును పనిచేసేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫైన్‌ చెల్లించి జులై 10న ఎవరైనా పాన్‌ లింక్‌ కోసం దరఖాస్తు చేస్తే ఆగస్టు 9న నాటికి వారి పాన్‌ కార్డు పునరుద్ధరిస్తారు. అంత వరకు పాన్‌ నిరుపయోగంగా ఉంటుంది. గడువులోగా పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్‌ రాదని, పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అటువంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేస్తారని ఐటీ శాఖ పేర్కొంది. ఒకవేళ మీరు డెడ్‌లైన్‌ మిస్‌ అయ్యి ఉంటే.. ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లోని ఈ-పే ట్యాక్స్‌ విభాగంలోకి వెళ్లి పెనాల్టీ చెల్లించి పాన్‌ను పునరుద్ధరించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని