Vodafone Idea: ఇది వ్యాపారం.. ఎక్కడ తగ్గాలో తెలిసిన బిర్లా!

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ టెలికాం సేవల సంస్థ ‘వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌)’ విషయంలో ఆ సంస్థ ప్రమోటర్‌ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో తన వాటాల్ని ప్రభుత్వ రంగ లేదా దేశీయ ఆర్థిక సంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.....

Published : 02 Aug 2021 20:50 IST

వొడాఫోన్‌-ఐడియాలో వాటాలు వదులుకునేందుకు సిద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ టెలికాం సేవల సంస్థ ‘వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌)’ విషయంలో ఆ సంస్థ ప్రమోటర్‌ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో తన వాటాల్ని ప్రభుత్వ రంగ లేదా దేశీయ ఆర్థిక సంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబాకు ఇటీవల లేఖ రాసినట్లు సమాచారం.

ఆర్థిక పరిస్థితి ఇదీ..

వీఐఎల్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం సహా వివిధ సంస్థలకు రూ.1.8 ట్రిలియన్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి  బకాయిలతో పాటు సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) ఛార్జీలు కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని కంపెనీ బోర్డు గత సెప్టెంబరులో నిర్ణయించింది. అమెరికా సహా అనేక దేశాల్లోని పెట్టుబడి సంస్థల్ని ఆశ్రయించింది. కానీ, ప్రభుత్వ పూచీ లేనిది ఏ ఒక్క సంస్థ కూడా పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేదు.

వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం.. వొడాఫోన్‌కు 44 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం వీఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.24 వేల కోట్లు. అలాగే కంపెనీలో కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని ఇరు వర్గాలు నిర్ణయించాయి. వొడాఫోన్‌ ఏకంగా ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి ప్రణాళికల్ని సైతం రద్దు చేసుకుంది.

ప్రభుత్వ సహకారం కావాలి..

ఏజీఆర్‌ ఛార్జీలు, స్పెక్ట్రం కేటాయింపుల బకాయిల మారిటోరియంపై ప్రభుత్వం నుంచి కొత్త పెట్టుబడిదారులు కచ్చితమైన పూచీ కోరుతున్నారు. సర్కార్‌ దీనిపై స్పందించని పక్షంలో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన సహకారం అవసరమని బిర్లా కోరారు. లేదంటే కంపెనీ కార్యకలాపాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 27 కోట్ల కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చానని లేఖలో పేర్కొన్నారు.

సుప్రీంలో చుక్కెదురు..

ఏజీఆర్‌ ఛార్జీల లెక్కింపునకు డిపార్ట్‌మెంట్‌  ఆఫ్‌ టెలికాం(డీఓటీ) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నాయంటూ పలు టెలికాం సంస్థలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ దోషాలు పరిహరించి లెక్కిస్తే ఏజీఆర్‌ ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ వీరికి అక్కడ చుక్కెదురైంది. ఆదేశాలివ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. డీఓటీ ప్రకారం.. వొడాఫోన్ ఐడియా రూ.58,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో వొడాఫోన్ రూ.7,854 కోట్లు ఇప్పటికే చెల్లించింది. అయితే, తమ లెక్కల ప్రకారం తాము రూ.21,533 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని వీఐఎల్‌ వాదిస్తోంది. కోర్టు తీర్పుపై ఉన్న ఆశలు కూడా ఆవిరయ్యాయి.

వ్యూహాత్మకమే?

టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. జియో, ఎయిర్‌టెల్‌ నుంచి వొడాఫోన్‌-ఐడియా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. కంపెనీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా కంపెనీ విలువ కంటే అప్పులే ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో వాటాల్ని వదులుకోవడమే మేలని భావించిన బిర్లా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు