ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవాలంటే..

మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడే మంచి రాబడిని ఆశించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా పెట్టుబడులు

Updated : 16 Apr 2021 13:10 IST

మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడే మంచి రాబడిని ఆశించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా పెట్టుబడులు పెట్టేవారు చాలామంది ఫండ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. ఎక్కువ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా వైవిధ్యం ఉంటుందని భావించడమే ఇందుకు కారణం. కానీ, ఐదు, ఆరు ఫండ్లకు మించి ఉండకుండా చూసుకోవడమే మేలని నిపుణుల సూచన.
* మీ దగ్గరున్న ఫండ్లలో కొంతకాలంగా తక్కువ రాబడినిస్తున్న పథకాలను గుర్తించండి. వాటి నుంచి బయటకు వచ్చేయండి. అయితే, ఒకటి రెండు నెలల పనితీరును చూడొద్దు. కనీసం ఏడాది పరిశీలించాలి.
* కొన్ని రంగాలకే పరిమితమయ్యే సెక్టోరియల్‌, థీమాటిక్‌ ఫండ్లు కొన్నిసార్లు మంచి రాబడినే ఇస్తాయి. కానీ, దీర్ఘకాలంలో అంత ఆకర్షణీయం కావు. వీటిద్వారా మనం అనుకుంటున్న వైవిధ్యం సాధ్యం కాదు. కాబట్టి, వీటిలో మదుపు గురించి మరోసారి ఆలోచించి, నిర్ణయం తీసుకోండి.
* ఒకే రకం పెట్టుబడి వ్యూహాలతో ఉన్న ఫండ్లు ఉన్నాయనుకోండి.. అప్పుడు రాబడులూ పరిమితంగానే వస్తాయి. ఉదాహరణకు మీ దగ్గర అన్నీ మిడ్‌-క్యాప్‌ ఫండ్లే ఉన్నాయనుకోండి.. ఇతర విభాగాల ఫండ్లు ఇచ్చే ప్రతిఫలాలను కోల్పోతారు. అందుకే, ఇలా ఒకే వ్యూహంతో ఉన్న ఫండ్లు ఒకటి-రెండుకు మించి ఉండకుండా చూసుకోండి.
* ఒకే ఫండ్‌లో పెద్ద మొత్తం జమ అవుతుంటే.. దాన్ని కాస్త తగ్గించాలి. అందులో నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసి, మంచి పనితీరుతో ఉన్న ఇతర ఫండ్లకు సర్దాలి.
* 1-2 మల్టీ క్యాప్‌ ఫండ్లు, ఒక మిడ్‌/స్మాల్‌ క్యాప్‌, ఒక అంతర్జాతీయ ఫండ్‌ ఇలా ఫండ్ల వర్గీకరణ ఉండేలా చూసుకోండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని