Investments: మీ పెట్టుబడిపై కనీసం ఇంత రాబడి రావాలి.. లేదంటే నష్టమే!

ద్రవ్యోల్బణం కన్నా రాబడి తక్కువగా ఉంటే, అసలు కూడా నష్టపోతాం. 

Updated : 17 Aug 2021 17:21 IST

ప్రతి ఒక్కరికీ ఎదో ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. దాని కోసం సంపాదన మొదలైన నాటి నుంచి ఏదో ఒకచోట మదుపు చేస్తుంటారు. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు రాబడి, భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం(లిక్విడిటీ), ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్థ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది.  వీటిలో ముఖ్యమైంది రాబడి. ద్రవ్యోల్బణం కన్నా రాబడి ఎక్కువ ఉండాలి. ద్రవ్యోల్బణం కన్నా రాబడి తక్కువగా ఉంటే, పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోతాం.

ఉదాహరణకు.. ఒక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే , మనం చేసే పెట్టుబడికి 6 శాతం పైన రాబడి ఉంటేనే వచ్చే ఏడాదికి మన పెట్టుబడి విలువ అంతే ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణం వస్తు సేవలను బట్టి మారుతుంటుంది. ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులకు 10 శాతం ఉంటే.. విద్యా ఖర్చులకు 8-9 శాతం, ఇళ్లపై 5-7 శాతంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని మదుపు చేయాలి. అలాగే మదుపును ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఉండాలి. పెరిగిన ఆదాయానికి తగినట్లుగా మదుపు చేయాలి. ఏటా చేసిన పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మన ఆదాయంలో వచ్చిన మార్పుల వల్ల, జీవన ప్రమాణాలలో మార్పుతో పాటు ఆర్ధిక లక్ష్యాలలో, చేసే మదుపు పథకాలలో, వడ్డీ రేట్లలో మార్పుల వల్ల రాబడిలో కూడా మార్పు వస్తుంది.

నం చేసే పెట్టుబడి కాలాన్ని అనుసరించి రాబడిలో మార్పు ఉంటుంది. స్వల్పకాలంలో కన్నా దీర్ఘకాలంలో మదుపు చేయడం ద్వారా చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం పొందవచ్చు. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయడం ద్వారా వివిధ రాబడి అంచనాలతో ఎంత మొత్తం లభిస్తుందో చూద్దాం.

ఉదాహ‌ర‌ణ‌కు.. నెలకు రూ.5 వేలను 3 ఏళ్ల పాటు మదుపు చేస్తే 36 నెలల తరువాత 6 శాతం రాబడి అంచనాతో రూ 1,97,664 పొందవచ్చు. ఈ సమయంలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 1,80,000. అంటే రాబడి రూ. 17,664. అదే రూ.5 వేలను 10 ఏళ్ళు మదుపు చేస్తే 120 నెలల తరువాత 6 శాతం రాబడి అంచనాతో రూ.8,23,494 పొందవచ్చు. ఈ సమయంలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.6 లక్షలు. అంటే రాబడి రూ.2,23,494. ఈ విధంగా నెలకు రూ.5 వేల చొప్పున వివిధ కాలపరిమితులకు మదుపు చేస్తే, 6%, 8%, 10%, 12%ల  అంచనా రాబడితో ఎంత పొందవచ్చో తెలుసుకోవచ్చు.

వయసుతో పాటు అనుభవం, ఆదాయం పెరుగుతాయి. కాబట్టి,  ప్రతి సంవత్సరం మదుపును కొంత శాతం పెంచుకుంటూ పోవాలి. సంపాదన మొదలైన నాటినుంచే మదుపు మొదలు పెట్టాలి. మదుపు చేయడం ఒక అలవాటుగా మారాలి. పట్టుదల, క్రమశిక్షణతో మీ ఆర్థిక ప్రణాళికలను సులభంగా ఆచరణలో పెట్టవచ్చు. జీతం వచ్చిన వెంటనే.. ముందు మదుపు చేసి, మిగిలిన దానినే ఖర్చుచేయాలి. ఆ విధంగా నెలవారీ బడ్జెట్ రూపొందించుకోవాలి. డబ్బు ఉండటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని